
శ్రీశైల దేవస్థానం:క్షేత్రాభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ, సిబ్బంది తమవంతు పాత్రను పోషించాలని ఈఓ పిలుపు నిచ్చారు. దేవస్థానంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి.
కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, పలువురు శాఖాధిపతులు, విభాగాధిపతులు, సిబ్బంది, శివసేవకులు, ఎస్.పి.ఎఫ్ సిబ్బంది, హోంగార్డు సిబ్బంది ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవస్థాన పరిపాలనా కార్యాలయ భవన ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాగణపతి పూజ జరిపారు. తరువాత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పమాల అర్పించారు.
అనంతరం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, హోంగార్డు సిబ్బంది, పతాక వందనం చేశారు. తరువాత కార్యనిర్వహణాధికారి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం జాతీయగీతం ఆలాపించారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి ప్రసంగిస్తూ ఎందరో దేశభక్తుల, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను మనం అనుభవిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలను వివరించారు.
గత సంవత్సర కాలములో దేవస్థానం సాధించిన ప్రగతిని ఈ ఓ తెలిపారు. క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకు అధికమవుతోందని, భక్తుల రద్దీకనుగుణంగా ఆయా సౌకర్యాలు కల్పించాల్సి అవసరం ఉందన్నారు. భక్తులరద్దీకనుగుణంగా ఆయా సౌకర్యాల కల్పనకు దేవస్థానం తగు చర్యలు చేపడుతోందన్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, క్షేత్రాన్ని అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్రాభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. సిబ్బంది అందరు కూడా క్షేత్రాభివృద్ధిలో తమవంతు పాత్రను పోషించాలన్నారు. దేవస్థానంలోని ఆయా విభాగాలు గత సంవత్సరకాలంగా సాధించిన ప్రగతిని కూడా వివరించారు.
కార్యక్రమములో భాగంగా పతావిష్కరణ తరువాత శ్రీ సాయిలిక్షితశ్రీ, లిక్షితా శ్రీ నృత్య కళాశాల, నందికొట్కూరు వారు దేశభక్తి గేయాలకు సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు.