అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు
తిరుపతి, 2022 నవంబర్ 27: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఆదివారం రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు.
రాత్రి 7 నుండి 9 గంటల వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలను తొలగిపోతాయని విశ్వాసం.
వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్, ఎమ్మెల్యే , టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మారుతి ప్రసాద్, రామేశ్వరరావు, సంపత్ నారాయణ, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.
Post Comment