విదేశాల నుంచి రాష్ట్రంలోకి వచ్చిన వారు తమ పరిధిలోని పోలీస్స్టేషన్లో గానీ, తహసీల్దార్ కార్యాలయంలో గానీ రిపోర్ట్ చేయాల్సిందిగా చేతులు ఎత్తి మొక్కుతున్నా.. దండం పెట్టి చెబుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
కరోనా వైరస్పై రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమై జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు. మనకున్న ప్రమాదమల్లా విదేశాల నుంచి వచ్చినవారితోనేనన్నారు. అది మన రాష్ట్రంవారు కావచ్చు. మన దేశస్థులు కావచ్చు. ఇతర దేశస్తులు కావచ్చన్నారు. మార్చి 1వ తేదీ నుండి ఇప్పటి వరకు విదేశాల నుంచి 20 వేల పైచిలుకు రాష్ట్రంలోకి వచ్చినట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 21కు చేరుకుందన్నారు. వీరిలో అందరికి అందరూ బయటి దేశం నుంచి వచ్చినవారేనన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు జాయింట్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 11 వేల మందిని గుర్తించి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం జరిగిందన్నారు. వీళ్లను 14 రోజులు పర్యవేక్షణలో ఉంచుతున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం వైద్యులు వారిని కలిసి కౌన్సెలింగ్ చేయడం జరుగుతుందన్నారు. వీరిలో ఎవరికైనా అస్వస్థత అయితే వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలిస్తారన్నారు.
*CM K. Chandrashekar Rao appealed to the people of Telangana to observe Janata Curfew and remain indoors for 24 hours starting 6 AM tomorrow to show unity and solidarity of the nation in the fight against Corona virus. PM Narendra Modi gave the call to stop the spread of Corona virus.