


శ్రీశైల దేవస్థానం:దేవస్థానంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, పలు విభాగాల అధికారులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ముందుగా ఈ ఉదయం గం. 10.00లకు ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులం ఆధునీకరణ పనులకు భూమిపూజ జరిపారు.
తరువాత గంగాధర మండపం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విరాళాల స్వీకరణ కేంద్రం ప్రారంభమయింది.. ఈ నూతన విరాళాల కేంద్రంలో మొదటి విరాళంగా ఎస్.ఆర్.ఆర్. వెంకట శివ సాకేత్ వర్మ, గవరవరం, కొయ్యలగూడెం మండలం, ఏలూరు జిల్లా వారు రూ. 1,01,116/-లను అన్న ప్రసాద వితరణకు విరాళంగా అందజేశారు.
ఆ తరువాత పరిపాలనా కార్యాలయంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుల వారి చేంబరుకు ప్రారంభోత్సవం జరిపారు.
ఈ కార్యక్రమం తరువాత శ్రీస్వామివారి స్పర్శ దర్శనం , అతిశీఘ్ర దర్శన టిక్కెటుదారులకు ఉచిత లడ్డుప్రసాదాలు అందజేత కార్యక్రమాన్ని ప్రారంభించారు.
చివరగా అమ్మవారి ఆలయ వెనుక భాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన కైలాస కంకణాల విక్రయ కేంద్రం ప్రారంభమయింది.
ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులాన్ని దాత సహకారంతో ఆధునీకరించడం జరుగుతుందన్నారు. ఈ ఆధునీకరణ పనులకు నాగదుర్గాప్రసాద్, సాయిస్కిల్స్ కళామందిరం, హైదరాబాద్ వారు ముందుకు వచ్చారన్నారు. ఆలయ వైదిక కమిటీ, ఇంజనీరింగ్ , దేవస్థానం సహాయ స్థపతి వారి సూచనలను అనుసరించి శ్రీగోకులాన్ని ఆధునీకరిస్తామన్నారు. భక్తులు ఆయా విరాళాలు చెల్లించే వీలుగా నూతన విరాళాల కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా స్పర్శదర్శనం, అతిశీఘ్రదర్శన భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం అందజేయు కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. శ్రీస్వామివారి స్పర్శదర్శనం టిక్కెట్టుదారులకు రెండు లడ్డు ప్రసాదాలు, అతిశీఘ్రదర్శన టిక్కెట్టుదారులకు ఒక లడ్డు ప్రసాదం ఉచితంగా అందజేస్తున్నామన్నారు. భక్తులందరికీ కూడా కైలాసకంకణాలను కొనుగోలు చేసేందుకు వీలుగా అమ్మవారి ఆలయం వెనుకభాగంలో కైలాక కంకణాల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా దాత సహకారంతో ఆలయంలోని శ్రీగోకులాన్ని ఆధునీకరణ పనులను చేపట్టడం జరుగుతోందన్నారు. భక్తులందరు కూడా సులభంగా ఆయా విరాళాల పథకాలకు విరాళాలు సమర్పించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద విరాళాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ విరాళాలసేకరణ కేంద్రంలో భక్తులు అన్నప్రసాద వితరణ, గోసంరక్షణ, ప్రాణదానట్రస్టు మొదలైన దేవస్థాన విరాళాల పథకాలకు ఆయా మొత్తాలను విరాళాల కేంద్రంలో సమర్పించవచ్చునన్నారు. భక్తులు తమ శక్తికొలది ఎంతమొత్తమైనా విరాళంగా చెల్లించవచ్చునని అన్నారు. ఆయా విరాళాల పథకాలకు రూ. 50,000 ఆ పై మొత్తాన్ని విరాళంగా చెల్లించే దాతలకు నిబంధనల మేరకు ఆయా సదుపాయాలు కల్పించబడుతాయన్నారు.
శ్రీస్వామివారి స్పర్శదర్శనం మరియు అతిశీఘ్రదర్శనం టిక్కెట్టుదారులు లడ్డు ప్రసాదాల విక్రయకేంద్రంలోని కౌంటరు నెం. 9 మరియు 10 ద్వారా లడ్డు ప్రసాదాలను ఉచితంగా పొందవచ్చునన్నారు. భక్తులందరూ ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన వెంటనే కైలాసకంకణాలను కొనుగోలు చేసేందుకు వీలుగా ఆలయ వెనుకభాగంలో ఈ విక్రయకేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి బి. రవణమ్మ, చిట్టిబొట్ల భరద్వాజశర్మ, శ్రీమతి జి. లక్ష్మీశ్వరి, శ్రీమతి జి.గంగమ్మ, శంకరశెట్టి పిచ్చయ్య, ఎ. అనిల్కుమార్, వెంకటసుబ్బారావు, చిలువేరు కాశీనాథ్, శ్రీమతి యు. సుబ్బలక్ష్మి, శ్రీమతి పి.యు. శివమ్మ, శ్రీమతి జిల్లెల శ్రీదేవి పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు కట్టా సుధాకరరెడ్డి, వి. వెంకటేశ్వర్లు, ఎ. శ్రీనివాసులు పాల్గొన్నారు.
శ్రీగోకులం భూమిపూజ కార్యక్రమములో దాత శ్రీ నాగదుర్గాప్రసాద్, సాయిస్కిల్స్ కళామందిరం, హైదరాబాద్ కూడా పాల్గొన్నారు.
