శ్రీశైల దేవస్థానంలో శాస్త్రోక్తంగా ముక్కోటి ఏకాదశి ప్రత్యేక ఉత్సవం

శ్రీశైల దేవస్థానం:ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం  శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు.

 వేకువ జామున శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజాదికాలు, రావణవాహనసేవ నిర్వహించారు.

 ఉదయం గం.3.00లకు ఆలయ ద్వారాలను తెరచి మంగళవాయిద్యాల అనంతరం గం.3.30 ని||లకు స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. తరువాత స్వామిఅమ్మవార్లకు ప్రాత:కాల పూజలు జరిపించి గం.4.30||లకు స్వామివారికి, తరువాత అమ్మవారికి మహామంగళ హారతులు పట్టారు.

మహామంగళహారతుల తరువాత శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపములో ఉత్తర ముఖంగా వేంచేబు చేయించి విశేష పూజాదికాలను జరిపారు. ఈ పూజాదికాలలో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవసంకల్పాన్ని పఠించారు.

 ఉత్సవ సంకల్పంలో దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, దేశంలో సుఖశాంతులు విలసిల్లాలని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని, ప్రమాదాలు, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని విన్నవించారు.

అనంతరం ఉత్సవ పూజాదికాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు. మహాగణపతి పూజ తరువాత శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజాదికాలు నిర్వహించారు.

 ఉత్సవంలో భాగంగానే ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండప ఉత్తర ద్వారం నుండి వెలుపలకు తోడ్కొనివచ్చి ఆలయ ఉత్తరభాగంలోనే రావణవాహనంపై ఆశీనులను చేయించి రావణవాహనసేవ జరిపారు. తరువాత రావణవాహనంపై స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉత్తరద్వారమైన శివాజీగోపురం నుంచి వెలుపలకు తీసుకువచ్చి గ్రామోత్సవం జరిపారు.

ప్రతీ ఉత్సవంలో ఆలయ మహాద్వారమైన తూర్పుద్వారం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్ళే స్వామిఅమ్మవార్లు సంవత్సరంలో రెండు పర్యాయాలు మాత్రమే ఉత్తర ద్వారమైన శివాజీగోపురం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్ళడం విశేషం. ముక్కోటి ఏకాదశి రోజున , శివముక్కోటి రోజున (వార్షిక ఆరుద్రోత్సవం రోజున) ఈ విధంగా శ్రీస్వామిఅమ్మవార్లు ఆలయ ఉత్తరద్వారం నుంచి గ్రామోత్సవానికి తరలివెళతారు. 

గ్రామోత్సవం తరువాత కూడా భక్తులు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు వీలుగా ఉత్సవ మూర్తులను ఆలయ ముఖమండపం ఉత్తరం వైపున (బలిపీఠం సమీపంలో) వేంచేబు చేయించారు.

శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ప్రారంభమైన తరువాత భక్తులను దర్శనానికి, ఆర్జితసేవలకు అనుమతించారు.

 ఉత్సవంలో కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు కె.శివప్రసాద్స్వమి, స్థానాచార్యులు (అధ్యాపక) ఎం. పూర్ణానంద ఆరాధ్యులు, సీనియర్ వేదపండితులు గంటి రాధకృష్ణశర్మ, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.