మేడారం, జనవరి 29 : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న రెండో సమ్మక్క–సారక్క జాతర ఇదేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తుల సౌకర్యార్థం అనేక శాశ్వత అభివృద్ధి పనులను చేపట్టిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
మేడారంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, సమ్మక్క–సారక్క జాతరను ‘జాతీయ పండుగ’గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల పర్యటనతో ఈ అంశం త్వరలోనే సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమ్మక్క–సారక్క జాతరను గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, మరో కుంభమేళాగా ఆయన అభివర్ణించారు. ఈ మహాజాతర విజయవంతంగా నిర్వహించేందుకు అంకితభావంతో కృషి చేసిన అధికారులు, సిబ్బంది మరియు సహకరించిన మీడియా మిత్రులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సూచనల మేరకు ఇన్ఛార్జ్ మంత్రి పర్యవేక్షణలో కేవలం 90 రోజుల్లోనే ఆలయ అభివృద్ధి పనులు మరియు మౌలిక వసతులు పూర్తి చేసినట్లు తెలిపారు. సాధారణంగా నాలుగు రోజులపాటు జరిగే జాతరను, ఈసారి భక్తుల రద్దీ దృష్ట్యా విస్తృత ఏర్పాట్లతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటివరకు జాతర ప్రశాంతంగా, సవ్యంగా కొనసాగుతోందని పేర్కొంటూ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, ఇతర జిల్లాల నుంచి వచ్చి సేవలందించిన సిబ్బంది, మరియు సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన మీడియా ప్రతినిధులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గద్దెల పునర్నిర్మాణం సహా మౌలిక సదుపాయాల పనులు నిర్ణీత కాలంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. సమ్మక్క–సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం కు విజ్ఞప్తి చేసినట్లు, అలాగే జాతర నిర్వహణకు మరింత ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్ర మంత్రులకు వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. లక్షలాది మంది భక్తులు హాజరవుతున్న ఈ మహాజాతరలో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంటూ, జాతర విజయవంతానికి సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు , మీడియా మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మేడారం, ములుగు జిల్లా:
సమ్మక్క–సారక్క జాతర గిరిజనుల మహాకుంభం : కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం
మేడారం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం, కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆలయాన్ని సందర్శించి సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకుని మొక్కులు సమర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలయ ప్రధాన ద్వారం వద్ద కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ డోలు–డప్పుల నడుమ ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు.
తదనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం మాట్లాడుతూ, “సమ్మక్క–సారక్క జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఇది గిరిజనుల మహాకుంభంగా నిలుస్తోంది. సుమారు 20 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు మళ్లీ ఈ పవిత్ర జాతరకు రావడం ఆనందంగా ఉంది” అని అన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు అందిస్తోందని తెలిపారు. జాతర నిర్వహణకు సహకరిస్తూనే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు పాత మిత్రులని, పార్లమెంటులో కలిసి పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు.
గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు.
- ధర్తీ ఆబా గిరిజన గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద ₹1 లక్ష కోట్లు
- పీఎం జన్-మన్ యోజన కింద ₹24,000 కోట్లు
- తెలంగాణకు 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు
అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో గిరిజన వ్యవహారాల ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటై, తొలి క్యాబినెట్ మంత్రిగా తాను బాధ్యతలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. భగవాన్ బిర్సా ముండా వంటి గిరిజన వీరుల త్యాగాలను దేశం గౌరవిస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
“సమ్మక్క–సారక్క జాతర గిరిజన ప్రజల అతిపెద్ద పండుగ. నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తారు” అని తెలిపారు. జాతర ఏర్పాట్లలో భాగస్వాములైన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
- ములుగు, లక్నవరం, మేడవరం, తాడ్వాయి, బొగత జలపాతం ప్రాంతాల పర్యాటక అభివృద్ధికి ₹80 కోట్లు
- రామప్ప దేవాలయ అభివృద్ధికి ₹140 కోట్లు
- ఈ ఏడాది జాతర నిర్వహణకు ₹3.70 కోట్లు మంజూరు
సమ్మక్క–సారక్క పేరుతో ₹890 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుందని, పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంబించు కుంటామని వెల్లడించారు.
లక్షలాది మంది వచ్చే ఈ మహాజాతరలో భక్తులకు కనీస వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ, అంకితభావంతో పనిచేస్తున్న అధికారులు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
