శ్రీశైల దేవస్థానం:కార్తిక దీపోత్సవం సందర్భంగా పలువురు భక్తులు ఈ రోజు (28.11.2021) కార్తిక దీపారాధనలను చేసుకున్నారు.ఉత్తరమాడవీధిలో, శ్రీ కృష్ణదేవరాయ గోపురము ఎదురుగా గల గంగాధర మండపం వద్ద భక్తులు కార్తిక దీపారాధనను ఆచరించారు.
ఈ రోజు ఉదయం నుండే భక్తులు కార్తికదీపారాధనలను చేసుకోవడంకనిపించింది. అదేవిధముగా కొందరు భక్తులు లక్షవత్తుల నోములను కూడా నోచుకున్నారు.
వేడిపాల వితరణ
భక్తుల సౌకర్యార్థం ఈ రోజు ఉదయం క్యూలైన్లలోని భక్తులకు వేడిపాలను అందించారు.
క్యూలైన్లలో అల్పాహారం అదేవిధంగా క్యూకాంప్లెక్స్ లో వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు , మంచినీరు అందించారు.
ఉచిత ప్రసాద వితరణ
ఈ రోజు వేకువజామున దర్శనాలు ప్రారంభమైనప్పటి నుండే భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేసారు. రాత్రివేళ సర్వదర్శనం ముగిసేంతవరకు భక్తులకు ఈ ఉచిత ప్రసాద వితరణ చేస్తున్నారు.
అన్నప్రసాద వితరణ కార్తికమాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థమై ప్రతిరోజు కూడా అన్నదానమందిరంలో ఉదయం 10.30గంటల నుండి మధ్యాహ్నం 3.30గంటల వరకు కూడా అన్నప్రసాదాలు అందిస్తున్నారు.
లడ్డు ప్రసాదాలు
కార్తికమాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేసారు. మొత్తం 9 కౌంటర్ల ద్వారా ఈ లడ్డు ప్రసాదాలు విక్రయిస్తున్నారు.
రేపు లక్షదీపోత్సవం – పుష్కరిణి హారతి:
కార్తిక నాల్గవ సోమవారం సందర్భంగా రేపు (29.11.2021) న పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సం, పుష్కరిణి హారతిని నిర్వహిస్తోంది. లోకకల్యాణం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ లక్షదీపోత్సవం, పుష్కరిణిహారతి కార్యక్రమాలు వుంటాయి.
లక్షదీపోత్సవం:
ఈ దీపోత్సవ కార్యక్రమంలో పుష్కరిణి ప్రాంగణమంతా కూడా దీపాలను ఏర్పాటు చేస్తారు.
పుష్కరిణి హారతి (దశవిధ హారతులు):
రేపు సాయంత్రం (29.11.2021) గం. 6.30ల నుండి ముందుగా శ్రీస్వామిఅమ్మవార్లకు మరియు పుష్కరిణికి దశవిధ హారతులు ఇస్తారు.
కాగా ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు వేంచేబు చేయించి విశేషంగా పూజాదికాలు చేస్తారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను ఇస్తారు.
అనంతరం ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి,నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, కర్పూరహారతి సమర్పిస్తారు.