11న కుంభోత్సవం-సంప్రదాయ పద్ధతిన ఏర్పాట్లు
శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం శ్రీ భ్రమరాంబాదేవి వారికి ఈ నెల 11న ( మంగళవారం ) కుంభోత్సవం జరుగనున్నది.ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారికి సాత్విక బలిని సమర్పించేందుకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు.ఈ సంవత్సరం పౌర్ణమి తరువాత మంగళవారం వచ్చింది.ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశి మొదలైనవి అమ్మవారికి సాత్త్విక బలిగా సమర్పిస్తారు.
ప్రాత:కాలపూజలు :
ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాత:కాలపూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమ పూజలను. జప పారాయణలను నిర్వహిస్తారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ ఎప్పటివలనే ఏకాంతంగానే జరుగుతాయి.
కొబ్బరికాయలు – గుమ్మడికాయల సమర్పణ :
ఈ పూజాదికాల తరువాత శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు మొదటి విడత సాత్వికబలిగా సమర్పిస్తారు.
కోటమ్మవారి పూజలు :
ఈ సందర్భంగానే హరిహరరాయ గోపురద్వారం వద్ద మహిషాసురుమర్థిని అమ్మవారికి (కోటమ్మవారికి ప్రత్యేక పూజాదికాలను జరిపించి సాత్విక బలిగానే కొబ్బరికాయలను సమర్పిస్తారు.
శ్రీ స్వామివారికి అన్నాభిషేకం :
ఈ ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం శ్రీ మల్లికార్జునస్వామివారికి ప్రదోష కాల పూజల అనంతరం అన్నాభిషేకం వుంటుంది. అనంతరం శ్రీస్వామివారి ఆలయ ద్వారాలు మూసివేస్తారు.
హారతి:
స్వామివార్ల పూజల అనంతరం అమ్మవారికి ఎదురు ప్రదక్షిణ మండపములో అన్నాన్ని కుంభరాశిగా వేస్తారు. అదేవిధంగా సింహ మండపం వద్ద కూడా భక్తులు అమ్మవారికి కుంభరాశిని సమర్పిస్తారు. తరువాత సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతిని సమర్పించడంతో ఉత్సవంలోని ప్రధానఘట్టం ప్రారంభమవుతుంది.
ఈ కుంభహారతి సమయములోనే అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలు అమ్మవారికి సమర్పిస్తారు. ఈ పసుపు, కుంకుమల సమర్పణకే “శాంతి ప్రక్రియ” అని పేరు.
ఈ సందర్భముగా కూడా రెండో విడత సాత్వికబలిగా అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పిస్తారు.
కుంభహారతి సమర్పణ తరువాత భక్తులకు దర్శనానికి అనుమతి వుంటుంది.
మహానివేదన :ఈ ఉత్సవం సందర్భంగా అమ్మవారికి మహానివేదన వుంటుంది.
దేవదాయ చట్టముననుసరించి క్షేత్ర పరిధిలో జంతు, పక్షి బలులు పూర్తిగా నిషేధించారు.
కుంభోత్సవం రోజున కల్యాణోత్సవం నిలుపుదల:
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఎప్పటి మాదిరిగా కుంభోత్సవం రోజున శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం, ఏకాంత సేవ నిలుపుదలచేస్తారు.అదేవిధంగా కుంభోత్సవం రోజున అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జితసేవలు కూడా నిలుపుదల చేస్తారు.
Post Comment