సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి
సంపూర్ణమౌతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే,
రమంతే తత్ర దేవతాః” అనే ఆర్యోక్తికి అనుగుణంగా సామాజిక విలువలను మరింతగా
తీర్చిదిద్దుకోవాల్సిన అవసరమున్నదని తెలిపారు. “అంతర్జాతీయ మహిళా దినోత్సవం”
సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మహిళందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
పురుషునితో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ విభిన్న రంగాలలో మహిళలు
సాధిస్తున్న అపూర్వమైన విజయాలు నారీశక్తిని చాటుతున్నాయని సీఎం అన్నారు.
స్త్రీ శక్తికి చాటే దిశగా _ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు సీ ఎం.
మహిళాసాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు, వారి గౌరవాన్ని పెంపొందిస్తూ, స్త్రీజనోద్ధరణే
లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరుస్తున్నదన్నారు..
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులైన మహిళలకు _ ప్రత్యేక సెలవును
మంజూరు చేసి మహిళలను సమున్నతంగా గౌరవించుకుంటున్నామని తెలిపారు.
తొమ్మిదేండ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా వారి సంక్షేమం,
అభివృద్దే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ రాష్ట్రం మహిళా సంక్షేమ రాష్ట్రంగా
వెలుగొందుతున్నదని సీఎం తెలిపారు. ఆడబిడ్డ తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి ఆ
బిడ్డ జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప
పథకాలను అమలు చేస్తూ ఆడబిడ్డను కంటికి రెప్పలా రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటున్నదని
సిఎం వివరించారు. మహిళా సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు
చేస్తున్న సమర్థవంతమైన కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సిఎం అన్నారు.