×

నవంబరు 14 నుండి డిసెంబరు 12 వరకు కార్తిక మాసోత్సవాలు-ఈ ఓ పెద్దిరాజు సమీక్ష

నవంబరు 14 నుండి డిసెంబరు 12 వరకు కార్తిక మాసోత్సవాలు-ఈ ఓ పెద్దిరాజు సమీక్ష

శ్రీశైల దేవస్థానం:నవంబరు 14 నుండి డిసెంబరు 12 వరకు కార్తిక మాసోత్సవాలు జరుగనున్నాయి.

కార్తిక మాస ఏర్పాట్లకు సంబంధించి సోమవారం  పరిపాలనా భవనంలోని
సమావేశ మందిరంలో సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక (స్థానాచార్యులు) అన్ని
విభాగాల యూనిట్‌ అధికారులు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో ముందుగా కార్యనిర్వహణాధికారి  డి. పెద్దిరాజు మాట్లాడుతూ కార్తిక మాసంలో
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాలను
ఆదేశించారు. ఆయా ఏర్పాట్లన్నీ కూడా ముందస్తుగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

ముఖ్యంగా కార్తిక సోమవారాలు, కార్తిక పౌర్ణమి, శుద్ధ, బహుళ ఏకాదశులు , ప్రభుత్వ
సెలవు రోజులలో భక్తులరద్దీ అధికంగా ఉంటుందని చెబుతూ రద్దీకనుగుణంగా ఆయా ఏర్పాట్లన్నీ
పకడ్బందీగా చేపట్టాలన్నారు. పాతాళగంగవద్ద శౌచలయాలకు, స్త్రీలు దుస్తులు మార్చుకునే గదులకు
, పాతాళగంగ మెట్లమార్గం మొదలైనచోట్ల అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు. గంగాభవానీ _స్నానఘట్టాలకు కూడా అవసరమైన మరమ్మతులను చేయించాలన్నారు.

భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, శ్రీస్వామిఅమ్మవార్ల ఆర్జితసేవలు, ఆలయ వేళలు, క్యూలైన్ల నిర్వహణ, రద్దీక్రమబద్దీకరణ, ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ, పారిశుద్ధ్యం, పార్కింగ్‌, కార్తికసోమవారాలలో లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తికపౌర్ణమి సందర్భంగా _ జ్వాలాతోరణం మరియు పుణ్యనదీహారతి ఏర్పాట్లు, కార్తికమాసంలో ఆకాశదీపం ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ మొదలైన అంశాలను గురించి సుదీర్టంగా
చర్చించారు.
సమావేశంలో ఈ క్రింది అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

సిబ్బందికి ప్రత్యేక విధులు :
* భక్తులకు సేవలు అందించేందుకుగాను కార్తిక మాసంలో రద్ధీరోజులందు కార్యాలయ సిబ్బందికి
ప్రత్యేక విధులు కేటాయిస్తారు.

దర్శనం ఏర్పాట్లు :

వేకువ జామున గం.3.00లకు ఆలయ ద్వారాలు తెరచి, ప్రాతఃకాల పూజల అనంతరం వేకువజామున
గం. 4.30ల నుంచి సాయంకాలం గం. 4.00ల వరకు దర్శనాలు కల్పిస్తారు. అదేవిధంగా
తిరిగి సాయంత్రం గం. 5.30ల నుంచి రాత్రి గం. 11.00ల వరకు దర్శనాలు కొనసాగుతాయి.

కార్తిక మాసంలో సోమవారాలు, ప్రభుత్వ సెలవుదినాలు మొదలైన రద్దీరోజులలో (కార్తికమాసంలో
మొత్తం 13 రోజులపాటు) స్వామివార్ల స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేస్తారు.

* ఈ రద్దీరోజులలో భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు.

ఆర్జితసేవలు :

* అదేవిధంగా రద్దీరోజులలో (కార్తీకమాసంలో మొత్తం 13 రోజులు) గర్భాలయ ఆర్జిత అభిషేకాలు,
సామూహిక అభిషేకాలు పూర్తిగా నిలుపుదలచేస్తారు.

* సర్వదర్శనం క్యూలైన్‌ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తికమాస
సాధారణ రోజులలో కూడా ఆర్జిత అభిషేకాలు పరిమితంగా వుంటాయి.

రెండు విడతలుగా ఆర్జిత హోమాలు నిర్వహిస్తారు.

రద్దీ రోజులలో అమ్మవారి అంతరాలయములో జరిపించే కుంకుమార్చనలు, అమ్మవారి ఆలయ
ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో చేస్తారు.

అన్నప్రసాదాల వితరణ :

* భక్తులకు అన్నదాన భవనములో ఉదయం గం.10.30ల నుండి అన్నప్రసాదాల వితరణ
చేస్తారు.

* సాయంత్రం గం. 6.30ల నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేస్తారు.

* క్యూ కాంప్లెక్స్‌లో దర్శనానికి వేచి ఉండే. భక్తులకు మంచి నీరు,బిస్కెట్లు అల్పాహారం
అందిస్తారు.

లడ్డు ప్రసాదాలు :

* కార్తిక మాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు
సిద్ధం చేస్తారు.

* రద్దీకి అనుగుణంగా ప్రసాదాల విక్రయ కేంద్రాలు ఏర్పాటు

రద్దీ రోజులలో ప్రస్తుతం ఉన్న 7 విక్రయ కేంద్రాలతో పాటు అదనపు కౌంటర్లు ఏర్పాటు
చేస్తారు.
పాతాళగంగవద్ద ఏర్పాట్లు
* కార్తిక మాసములో భక్తులు పుణ్యస్నానాలకు ప్రాధాన్యత ఇస్తారు  కనుక  అవసరమైన అన్ని ఏర్పాట్లు వుంటాయి.

పాతాళగంగ వద్ద హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కార్తిక దీపోత్సవం:
* భక్తులు కార్తిక దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడ వీధీ (శివవీధి) ప్రత్యేక
ఏర్పాట్లు వుంటాయి.
పుణ్యనదీ హారతి:
కార్తిక పౌర్ణమి నవంబరు 27వ తేదీ అయినప్పటికీ, ఆ రోజున పౌర్ణమి ఘడియలు మధ్యాహ్నం
వరకు మాత్రమే ఉన్నాయి. ఆ ముందు రోజు అనగా 26 తేదీ – రెండవ ఆదివారం రోజుననే
ప్రదోషకాలంలో పౌర్ణమి ఘడియలు వుంటాయి.* అందుకే 26వతేదీ సాయంకాలానే కృష్ణవేణి నదీమతల్లికి పుణ్యనదీహారతి కార్యక్రమంనిర్వహిస్తారు.
* ఈ సందర్భంగా పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణవేణీ విగ్రహానికి పూజాదికాలు, సారె సమర్చణ
చేస్తారు.
* అదేవిధంగా జ్వాలాతోరణ కార్యక్రమం 26వ తేదీ సాయంకాలాన నిర్వహిస్తారు.
సాంస్కృతిక కార్యక్రమాలు:
* ఆలయ నిత్యకళావేదిక వద్ద ప్రతిరోజు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయి.
* ఈ సంవత్సరం జాతీయస్థాయి , అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కళాకారులచే
కూడా ఆయా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.
* లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి రోజులలో పుష్కరిణి వద్ద ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు
చేస్తారు.

print

Post Comment

You May Have Missed