
శ్రీశైల దేవస్థానం: పార్కింగ్ ప్రదేశాలు, వాటి పరిసరాలన్నీ శుభ్రంగా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఈ ఓ ఆదేశించారు. ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణకుగాను వివిధ విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కార్యనిర్వహణాధికారిఎం. శ్రీనివాసరావు శనివారం పలు పార్కింగు ప్రదేశాలు, ఆరుబయలు ప్రదేశాలను పరిశీలించారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.
గంగాధర మండపం నుంచి దక్షిణ , ఉత్తరంవైపు ప్రధాన రహదారులు, టూరిస్ట్ బస్టాండు, యజ్ఞవాటిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీప ప్రదేశాలు, సాంస్కృతిక కళాప్రదర్శన వేదిక ( యాంఫీ థియేటర్), ఏనుగుల చెరువుకట్ట మొదలైనవాటిని కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ షెడ్లలలో గ్రీన్ మ్యాట్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు.అదేవిధంగా గంగాధర మండపం నుంచి సర్వదర్శనం క్యూలైన్ ప్రారంభమయ్యే ప్రవేశద్వారం వరకు ప్రధాన రహదారికి కుడివైపున దర్శనం కోసం భక్తులు వేచివుండేందుకు వీలుగా విశాలమైన షెడ్డును, క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. వీటికి ఎదురుగా అంటే ప్రధాన రహదారికి ఎడమవైపున సామాన్లు భద్రపరుచుకునే గదిని, పాదరక్షలు భద్రపరుచుకునే గదులను ఏర్పాటు చేయాలన్నారు. వీటిని వీలైనంత విశాలంగా ఏర్పాటు చేయాలన్నారు.
క్యూకాంప్లెక్సుకు కుడివైపున (క్యాంటిన్ నెం -1 : తొలగించిన ప్రదేశం) శాశ్వత ప్రాతిపదికన షెడ్డును నిర్మించాలన్నారు ఈ ఓ. ఈ షెడ్డులో శీఘ్ర దర్శనం క్యూలైన్లను ఏర్పాటు చేసే వీలు కలుగుతుందన్నారు.తరువాత పలు పార్కింగు ప్రదేశాలను సందర్శించారు. వివిధ పార్కింగు ప్రదేశాలలో ఇప్పటికే. ప్రారంభించిన జంగిల్ క్లియరెన్సు పనులను ( పిచ్చిమొక్కలను తొలగించే పనులను) త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జంగిల్ క్లియరెన్సు పూర్తయిన వెంటనే గ్రావెల్ వేయించి, ఆయా ప్రదేశాలను చదును చేసే లెవెలింగు పనులను ప్రారంభించాలన్నారు.ముఖ్యంగా పార్కింగు ప్రదేశాలలో అక్కడక్కడా వున్న బండరాళ్లు మొదలైనవాటిని వెంటనే తొలగించి తగిన విధంగా చదును చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశాలు, వాటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండేందుకుగాను అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.
అన్ని పార్కింగ్ ప్రదేశాలలో కూడా మంచినీటి సదుపాయం మరియు తాత్కాలిక విద్యుద్దీకరణ పనులు చేపట్టాలని నీటిసరఫరా మరియు ఎలక్ట్రికల్ విభాగాన్ని ఆదేశించారు ఈ ఓ. వీలైనంత మేరకు అన్ని ప్రదేశాలలో కూడా తాత్కాలిక శౌచాలయాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు.అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాలలో వీలైనచోట్లంతా ప్రథమచికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా సమాచార కేంద్రాలను (May I Help You Centers) కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఆయా సమాచార కేంద్రాలలో సమాచార కరపత్రాలు కూడా అందుబాటులో ఉంచాలన్నారు.ఆయా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవలసిన దారులు , పార్కింగ్ స్థలాలు స్పష్టంగా తెలిసేవిధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ , ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
తరువాత మంచినీటిసరఫరాకు సంబంధించి పాత ఫిల్టరుబెడ్లో నింపుకునే కేంద్రాన్ని ( వాటర్ ఫిల్లింగు పాయింట్) పరిశీలించారు ఈ ఓ.ప్రాంగణములో జంగిల్ క్లియరెన్సు పనులను వెంటనే చేపట్టాలన్నారు. అదనంగా వాటర్ ఫిలింగు పాయింట్ వరకు మరో రహదారిని ఏర్పాటు చేయాలన్నారు. వాటర్ ట్యాంకు వాహనాలు ఫిల్లింగ్పాయింట్ వద్దకు వెళ్ళేందుకు ఒక రహదారి, వెలుపలకు వచ్చేందుకు మరో రహదారిని వినియోగించాలన్నారు.
పాత పిల్టరు బెడ్ ప్రాంగణములో ఉసిరివనాన్ని ఏర్పాటు చేయాలన్నారు ఈ ఓ. ఈ ప్రతిపాదిత వనములో ఉసిరి మొక్కలతో పాటు ఇతర దేవతా వృక్షాలను, ఫలవృక్షాలను, పూలమొక్కలను నాటాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. ఈ ప్రాంగణాన్నంతా కార్తీక వనభోజనాలకు అనువుగా తీర్చిదిద్దాలన్నారు. దీని వలన భక్తులు ఆ ప్రదేశంలో కార్తికమాసంలో వనభోజనాలు ఆచరించేందుకు వీలు కలుగుతుందన్నారు.తరువాత మాడవీధిలోని కళాప్రాంగణం వెనుక భాగంలో ( లడ్డు ప్రసాదాల విక్రయకేంద్రాల ఎడమవైపు ప్రదేశం) కూడా పార్కింగు ప్రదేశంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రదేశంలో ప్రముఖులు , అధికారుల వాహనాలను (వి.ఐ.పి వెహికల్ పార్కింగు) నిలిపే ఏర్పాటు చేయాలన్నారు.
ఏనుగుల చెరువుకట్టను సుందరీకరించే పనులకు తగు ప్రణాళికలు రూపొందించి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు ఈ ఓ. ఈ సుందరీకరణ వలన ఆలయం వెనుక భాగమంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు.ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో హేమారెడ్డి మల్లమ్మ మందిరం సమీపంలోని యాంపీ థియేటరులో కూడా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
ఈ పరిశీలనలో ఎగ్జ్యిక్యూటీవ్ ఇంజనీర్లు పి.ఎం. మురళీ బాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, పారిశుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జునరెడ్డి, సివిల్ , ఎలక్ట్రికల్ విభాగపు ఇంచార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, పి. చంద్రశేఖరశాస్త్రి, పి.వి. సుబ్బారెడ్డి, సంబంధిత సహాయ కార్యనిర్వహక ఇంజనీర్లు , ఎడిటర్ డా. సి. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.