
శ్రీశైల దేవస్థానం:ఉగాది ఉత్సవాలు ఈ నెల 19 నుండి 23 వరకు అయిదు రోజులపాటు జరుగనున్న నేపధ్యంలో ఈ ఓ వివిధ ఏర్పాట్లు పరిశీలించారు.ఈ ఉత్సవాల సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు పాదయాత్రతో క్షేత్రాన్ని చేరుకుంటున్నారు.అందుకే కాలిబాటలో అటవీశాఖ, వైద్యఆరోగ్యశాఖ మొదలైన శాఖల సమన్వయం తో పలు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా కైలాసద్వారం వద్ద భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేస్తున్నారు.కైలాసద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు వీలుగా విశాలమైన తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేసారు.
కైలాసద్వారానికి నిరంతరం మంచినీటి సరఫరా చేస్తారు. ముఖ్యంగా కైలాసద్వారం నుండి భీమునికొలను వరకు తాత్కాలిక పైప్ లైన్ ద్వారా మంచినీరు అందిస్తున్నారు.
ఈ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా బుధవారం కార్యనిర్వహణాధికారి ఈ ఓ , సంబంధిత ఇంజనీరింగ్ విభాగ అధికారులతో కలిసి కైలాసద్వారం, భీమునికొలను మెట్లమార్గం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా కార్యనిర్వహణాధికారి కైలాసద్వారం వద్ద కన్నడ స్వచ్ఛంద సేవకులు నిర్వహిస్తున్న అన్నదానశిబిరాన్ని పరిశీలించారు. దాతలు నిర్వహిస్తున్న ఈ అన్నదాన నిర్వహణకు దేవస్థానం పూర్తి సహాయసహకారాలు అందిస్తోన్నది. ముఖ్యంగా అన్నదాన నిర్వహణకు చలువపందిర్లు ఏర్పాటు, మంచినీటిసరఫరా, మజ్జిగ సరఫరా మొదలైన ఏర్పాట్లను దేవస్థానం చేస్తోంది.
కార్యనిర్వహణాధికారి నిర్వాహకులతో మాట్లాడుతూ తప్పనిసరిగా శుచీ శుభ్రతలను పాటించాలన్నారు. కైలాసద్వారం వద్ద తగినంత పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలని దేవస్థానం పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.ఈ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా కార్యనిర్వహణాధికారి కాలిబాటతో వచ్చే పలువురు భక్తులతో ముఖాముఖిగా సంభాషించారు. కాలిబాటలో ఆయా ఏర్పాట్లపై రాయచూర్, విజయపుర, బాగల్ కోట్ మొదలైన ప్రాంతాల నుంచి పాదయాత్రతో వస్తున్న భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు అందరు కూడా ఆయా ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.అదేవిధంగా దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుంటూ శ్రీస్వామిఅమ్మ వార్లను దర్శించుకోవాలని కూడా భక్తులకు సూచించారు.
ఈ ఏర్పాట్ల పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి.రామకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్, నీటిసరఫరా విభాగం సహాయ ఇంజనీరు రాజేష్, ఎడిటర్ డా. సి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్యూలైన్ల పరిశీలన:
కార్యనిర్వహణాధికారి సంబంధిత అధికారులతో కలిసి క్యూలైన్ల పరిశీలించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నందున అన్ని విభాగాల వారు సమన్వయముతో విధులు నిర్వహిస్తూ భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలన్నారు.శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం భక్తులు టికెట్ల కోసం అధిక సమయం వేచి ఉండకుండా వుండేందుకుగాను అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
క్యూలైన్లలో నిరంతరం మంచినీరు, అల్పాహారాలను అందిస్తుండాలన్నారు. అదేవిధంగా బిస్కెట్లను కూడా అందజేస్తుండాలన్నారు.క్యూ కాంప్లెక్స్లోని మంచినీటి కుళాయిలు, వాప్బేసిన్లు అన్ని కూడా వినియోగానికి అందుబాటులో వుండే విధముగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యూకాంప్లెక్స్ లోని అన్ని శౌచాలయాలలో శుభ్రత నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు. అన్ని శౌచాలయాలలో కూడా నిరంతరం నీటి సరఫరా ఉండే విధముగా తగు చర్యలు తీసుకోవాలన్నారు.క్యూకాంప్లెక్స్ లోనూ , ఆర్జితసేవా కౌంటర్ల వద్ద ఫ్యాన్లు సక్రమంగా పనిచేసేవిధంగా ఎలక్ట్రికల్ విభాగపు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. ఆలయ ప్రసారవ్యవస్థ ద్వారా కన్నడభాషలో కూడా ఎప్పటికప్పుడు భక్తులకు ఆయా సూచనలు,సలహాలను తెలియజేస్తుండాలన్నారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్, పర్యవేక్షకులు అయ్యన్న,ఎడిటర్ డా. సి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.