శ్రీశైల దేవస్థానం:*కైలాసద్వారం వద్ద ఏర్పాట్ల పరిశీలన *ఏర్పాట్లను సమీక్షించిన కార్యనిర్వహణాధికారి *మంచినీటి సరఫరా పకడ్బందీగా ఉండాలని ఆదేశం *పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు*
ఉగాది మహోత్సవాలు 27.03.2025 నుండి 31.03.2025 వరకు అయిదు రోజులపాటు జరుగుతాయి.ఈ ఉత్సవాల సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు పాదయాత్రతో క్షేత్రాన్ని చేరుకుంటున్నారు.ఇందులో భాగంగా కైలాసద్వారం వద్ద భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేస్తున్నారు. కైలాసద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు వీలుగా విశాలమైన తాత్కాలిక షెడ్డు ఏర్పాటు ఉన్నాయి.కైలాస ద్వారానికి నిరంతరం మంచినీటి సరఫరా చేయడం జరుగుతోంది. ముఖ్యంగా కైలాసద్వారం నుండి భీమునికొలను వరకు తాత్కాలిక పైప్ లైన్ ద్వారా మంచినీరు అందిస్తున్నారు.కైలాసద్వారం-భీముని కొలను మార్గంలో ఆరు చోట్ల తాత్కాలికంగా 1000 లీటర్ల సామర్థ్యం గల ఆరు సింటెక్స్ ట్యాంకులు ఏర్పాట్లు ఉన్నాయి. అదేవిధంగా కైలాసద్వారం వద్ద 5000 లీటర్ల సామర్థ్యం గల 8 సింటెక్స్ ట్యాంకులు అదనంగా ఏర్పాట్లు చేశారు. కైలాసద్వారం వద్ద 20 వేల లీటర్ల సామర్థ్యం గల శ్వాశ్వత మంచి నీటి ట్యాంకుల ద్వారా కూడా నీటి సరఫరా చేస్తున్నారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన భాగంగా శుక్రవారం కార్యనిర్వహణాధికారి సంబంధిత ఇంజనీరింగ్, పారిశుద్ధ్య విభాగ అధికారులతో కలిసి కైలాసద్వారం , భీమునికొలను మెట్లమార్గం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా హటకేశ్వరం, సాక్షిగణపతి వద్ద కూడా ఆయా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఎటువంటి అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా ఉండాలన్నారు. అధికారులందరూ కూడా పరస్పర సమన్వయంతో ఆయా ఏర్పాట్లలలో నిమగ్నం కావాలన్నారు.
అనంతంరం కార్యనిర్వహణాధికారి కైలాసద్వారం వద్ద కన్నడ స్వచ్ఛంద సేవకులు నిర్వహిస్తున్న అన్నదానశిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ దాతలు నిర్వహిస్తున్న అన్నదానానికి దేవస్థానం తరుపున పూర్తి సహాయ సహకారాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అక్కడి అన్నదానానికి దేవస్థానం తరపున పాలు, మజ్జిగను అందజేయాలన్నారు.కాగా అక్కడి అన్నదాన నిర్వహణకు దేవస్థానం చలువపందిర్లతో పాటు తాత్కాలిక విద్యుద్దీకరణను కూడా ఏర్పాటు చేసింది.
తరువాత కార్యనిర్వహణాధికారి అన్నదాన నిర్వాహకులతో మాట్లాడుతూ తప్పనిసరిగా శుచీ శుభ్రతలను పాటించాలన్నారు. తాజా కూరగాయలనే వాడాలని సూచించారు. ముఖ్యంగా ఆహారపదార్థాలపై ఎప్పటికప్పుడు మూతలు పెడుతుండాలన్నారు. కైలాసద్వారం వద్ద తగినంత పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలని దేవస్థానం పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ముఖ్యంగా కైలాసద్వారం వద్ద భక్తులు కొబ్బరికాయలను సమర్పించే ప్రదేశములలో తగు పారిశుద్ధ్య ఏర్పాట్లు వుండాలన్నారు.
ఈ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా కార్యనిర్వహణాధికారివారు కాలిబాటతో వచ్చే పలువురు భక్తులతో ముఖాముఖిగా సంభాషించారు. కాలిబాటలోని ఏర్పాట్ల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు అందరు కూడా ఆయా ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.అదేవిధంగా దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుంటూ శ్రీస్వామిఅమ్మ వార్లను దర్శించుకోవాలని కూడా భక్తులకు సూచించారు.
ఈ ఏర్పాట్ల పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పి. మురళీ బాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, పారిశుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి.వి. సుబ్బారెడ్డి (/c), ఎడిటర్ డా. సి. అనిల్ కుమార్ సంబంధిత సహాయ ఇంజనీర్లు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.