
శ్రీశైల దేవస్థానం:రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ ఆదేశాల మేరకు గోపాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు (12.11.2021) ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులంలో గోపూజను నిర్వహించింది.
ప్రతినిత్యం ఆలయంలో ప్రాత:కాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహిస్తున్నప్పటికి , గోపాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు నిత్యసేవతో పాటు విశేషంగా గోపూజ చేసారు. ఈ గోపూజలో గోవులకు, గోవత్సాలకు (ఆవుదూడలకు) పూజాదికాలు చేసారు.
దేవస్థాన గోసంరక్షణశాలలో కూడా గోపూజ జరిగింది.
కాగా తాను చేసిన ప్రతిపనిలోనూ వైశిష్యాన్ని బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ, ఆవుల మంద అధికంగా ఉన్న కారణంగా గోకులంగా పేరొందిన వ్రేపల్లెలో పెరిగి, గోవులను కాసి, గోపాలునిగా పేరుగాంచి, గోవు అనంత మహిమను లోకానికి తెలియజేశాడు.
శ్రీకృష్ణ పరమాత్మడు కార్తిక శుద్ధ అష్టమి రోజునే మొట్ట మొదటి సారిగా గోవులను మేత కోసమై అడవులకు తోలుకొని వెళ్ళాడని నమ్మకం. అందుకే కార్తిక శుద్ధ అష్టమి రోజు గోపాష్టమిగ ప్రసిద్ధమైనది. ఈ గోపాష్టమి రోజున గోవును విశేషంగా పూజించటం సంప్రదాయం.
ఈరోజు ఆలయప్రాంగణంలోని శ్రీగోకులంలో జరిగిన ఈ కార్యక్రమములో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు, వేదపండితులు పూజాసంకల్పాన్ని పఠించారు.
ఈ సంకల్పములో సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, పాడిపంటలతో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అగ్నిప్రమాదాలు, వాహనప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని, అందరికి శ్రేయస్సు కలగాలని చెప్పబడింది.
ఆ తరువాత పూజాదికాలు నిర్విఘ్నంగా జరిగేందుకుగాను ముందుగా మహాగణపతి పూజ చేసారు.
అనంతరం గోవులకు షోడశ ఉపచారాలతో పూజాదికాలు చేసారు. శ్రీ సూక్తంతోనూ, గో అష్టోత్తరమంత్రంతోనూ ఈ పూజాదికాలను జరిపారు. మన వేదసంస్కృతిలో గోవుకు ఎంతో విశేషస్థానం ఉందని పండితులు పేర్కొంటున్నారు.
గోవు సకల దేవతలకు ఆవాస స్థానం కావడం చేత గోవును పూజించడం వలన దేవతలందరినీ పూజించిన ఫలితం లభిస్తుందని నమ్మకం.
అంతేకాకుండా గోపూజను ఆచరించడం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న, శ్రీస్వామివారి ఆలయ ప్రధానార్చకులు వీరభద్రయ్యస్వామి, సహాయ కార్యనిర్వహణాధికారి హరిదాసు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. ఈ పూజాదికాలలో పలువురు భక్తులు కూడా పాల్గొన్నారు.