
శ్రీశైల దేవస్థానం:భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవలసిన ఆయా చర్యలపై చర్చించేందుకు కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
బుధవారం సాయంత్రం కార్యాలయ భవనములోని సమావేశమందిరం లో జరిగిన ఈ సమీక్షలో అన్నివిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి విభాగం కూడా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇందుకు తనవంతు కృషి చేయాలన్నారు.
ముఖ్యంగా క్యూలైన్ నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు ఈ ఓ . నడవలేని వారు, దివ్యాంగుల సౌకర్యార్థం విరాళాల కేంద్రం వద్ద మరిన్ని చక్రాల కుర్చీలను అందుబాటులో ఉంచాలన్నారు. దర్శనానికి చక్రాల కుర్చి ఏర్పాట్లను పొందాలనుకునేవారు ఆన్లైన్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఐ.టి.విభాగాన్ని ఆదేశించారు. ఇప్పటికే క్యూ కాంప్లెక్సు నందు బేబి ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, సదరు సదుపాయాన్ని భక్తులు వినియోగించుకునే విధంగా భక్తులలో అవగాహన కలిగించాలన్నారు. క్యూకాంప్లెక్సు సిబ్బంది ఈ విషయమై తగు శ్రద్ధను కనబర్చాలన్నారు.
క్యూకాంప్లెక్సులో వేచివున్న భక్తులకు కాలాతీతం కాకుండా నిరంతరం అల్పాహారం, మంచినీటిని అందిస్తుండాలన్నారు. క్యూకాంప్లెక్సు , క్యూలైన్ల వద్ద తగినంత స్థాయిలో శివసేవకులను, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ విషయములో నిర్ధిష్టమైన విధానాన్ని రూపొందించుకుని తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర సమయాలలో వినియోగించుకునేందుకు క్యూలైన్లలో ఏర్పాటు చేసిన అత్యవసర గేట్లు ( ఎమర్జెన్సీ గేట్లు) సజావుగా పనిచేసే విధంగా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలన్నారు. క్యూకాంప్లెక్సులోని మరియు క్యూలైన్లలోని మంచినీటి కుళాయిలు మరియు వాష్బషన్లు అన్ని కూడా వినియోగానికి అందుబాటులో ఉండాలన్నారు. అన్ని వాటర్ పాయింట్లకు కూడా నిరంతరం నీటిసరఫరా ఉండాలన్నారు. క్యూకాంప్లెక్సులోని అన్ని శౌచాలయాలలో శుభ్రత నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వీటిని శుభ్రపరిచేవిధంగా అధికారులు పర్యవేక్షిస్తుండాలన్నారు.
అదేవిధంగా అన్నప్రసాదాల వితరణ కూడా నిర్ధిష్టమైన పద్ధతిలో ఉండాలన్నారు. అన్నప్రసాదాలలోని వంటకాలన్నీ రుచికరంగా ఉండేటట్లుగా అధికారులు జాగ్రత్త వహించాలన్నారు. అన్నప్రసాదవితరణకు సంబంధించి సమయపాలనను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఉదయం వేళలో అన్నప్రసాదాలను, సాయంకాలం అల్పాహారాన్ని ఎటువంటి కాలతీతం కాకుండా భక్తులకు అందజేస్తుండాలన్నారు.
ముఖ్యంగా అన్నప్రసాద వితరణ హాలులో కూడా అన్నప్రసాదాలు వడ్డన సజావుగా జరిగేటట్లుగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు. ప్రతి హాలును కూడా ప్రత్యేకంగా సిబ్బంది ఒకరు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు.అన్నప్రసాదవితరణలో కూడా శివసేవకుల సేవలను విరివిగా వినియోగించుకోవాలన్నారు. సిబ్బంది
అందరు కూడా భక్తులతో మర్యాదగా మెలగాలన్నారు.ఈ విషయమై శివసేవలకు కూడా అవగాహన కల్పించాలన్నారు.