
శ్రీశైల దేవస్థానం:వినాయక చవితిని పురస్కరించుకొని లోకకల్యాణం కోసం 9 రోజులపాటు జరిపే గణపతి నవరాత్రోత్సవాలు శనివారం ఘంగా ప్రారంభం అయ్యాయి.
ఈ నవరాత్రోత్సవాలలో 9 రోజులపాటు ఆలయప్రాంగణంలోని రత్నగర్భ గణపతిస్వామివారికి, యాగశాలలో వేంచేబుచేయించిన కాంస్య గణపతిమూర్తికి, సాక్షి గణపతి ఆలయంలోని స్వామివారికి, సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పిన వరసిద్ధి వినాయకస్వామి వారికి (మృత్తికా గణపతిస్వామివారికి) విశేషంగా పూజాదికాలు నిర్వహించారు.
ఈ నెల 16వ తేదీ ఉదయం జరిగే పూర్ణాహుతి, అవబృథ కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
ఈ ఉదయం ఉత్సవాల ప్రారంభంలో యాగశాల ప్రవేశం, శివసంకల్పం, గణపతిపూజ, వేదస్వస్తి, శివసంకల్పం, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణధారణ తదితర కార్యక్రమాలు జరిగాయి.
యాగశాల ప్రవేశం :
ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు.
వేదస్వస్తి:
ఆలయ ప్రవేశం చేసిన తరువాత వేదపండితులు వేదపారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు.
శివసంకల్పం :
వేదపఠనం అయిన వెంటనే స్థానాచార్యులు వారు లోకక్షేమాన్ని కాంక్షిస్తూ నవరాత్రతోత్సవ సంకల్పాన్ని
పఠించారు.ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్పపఠనం చేశారు.
కంకణపూజ, కంకణధారణ
పుణ్యాహవచనం తరువాత కంకణాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపారు. తరువాత కంకణధారణ కార్యక్రమం జరిగింది.
ఋత్విగ్వరణం :
ఉత్సవాలలో భాగంగా ఋత్విగ్వరణం నిర్వహించారు.బ్రహ్మోత్సవాలలో ఆయా వైదిక కార్యక్రమాలు నిర్వహించాలని ఋత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్షా వస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు.
అఖండస్థాపన :
ఋత్విగ్వరణం తరువాత అఖండ దీపస్థాపన, వాస్తుహోమం జరిపారు.
కలశస్థాపన :
వాస్తు హోమం తరువాత మండపారాధన చేసి గణపతి కలశస్థాపన చేశారు. కలశస్థాపన తరువాత కలశార్చన జరిగింది.
అనంతరం లోకకల్యాణం కోసం జపానుష్ఠానాలు జరిపారు
అంకురార్పణ :
ఈ నవరాత్రతోత్సవాలలో మొదటిరోజు సాయంకాలం అంకురార్పణకు ఎంతో విశేషముంది. ఈ కార్యక్రమములో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత పునీత ప్రదేశములోని మట్టిని సేకరించి యాగశాలకు తీసుకువచ్చారు . దీనినే ” మృత్సంగ్రహణం” అంటారు. తరువాత ఈ మట్టిని తొమ్మిది పాలికలలో (మూకుళ్ళలో) నింపి, దాంట్లో నవధాన్యాలను పోసి వాటిని మొలకెత్తించే పనిని ప్రారంభించారు. పాలికలలో రోజూ నీరు పోసి నవధాన్యాలు పచ్చగా మొలకెత్తేలా చూస్తారు.
ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ యాగశాలలో మండపారాధనలు, జపానుష్ఠానాలు,
గణపతిహోమం, పారాయణలు, దేవతా హవనములు జరుగుతున్నాయి.
కాగా ఉత్సవాల చివరి రోజైన 16వ తేదీన ఉదయం జరిగే పూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృథ కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
రత్నగర్భగణపతికి ప్రత్యేక పూజలు
గణపతి నవరాత్రోత్సవాలలో భాగంగానే ఈ రోజు ఆలయప్రాంగణంలోని రత్నగర్భగణపతి స్వామివారికి విశేషంగా అభిషేకం, అర్చనలు జరిగాయి. ఉత్సవ సమయంలో ప్రతిరోజు కూడా ఈ విశేష కార్యక్రమాలు వుంటాయి.
| సాక్షిగణపతిస్వామివారికి ప్రత్యేక పూజలు
నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ఈ ఉదయం సాక్షిగణపతి స్వామివారికి ప్రత్యేక అభిషేకం, విశేష అర్చనలు జరిగాయి. పంచామృతాలతోనూ, ఫలోదకాలతోనూ, శుద్ధజలంతోనూ ఎంతో శాస్త్రోక్తంగా ఈ అభిషేకాన్ని నిర్వహించారు. . ఉత్సవ రోజులలో ప్రతిరోజూ కూడా స్వామివారికి విశేషపూజలను చేస్తారు.
వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేకపూజలు
గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా సాక్షిగణపతి ఆలయంలో ప్రత్యేకంగా వరసిద్ధివినాయక స్వామిని (మృత్తికాగణపతిస్వామి) నెలకొల్పారు. ఉత్సవాలలో భాగంగా ఈ వరసిద్ధి వినాయకస్వామి వారికి (మృత్తికా గణపతి వారికి) విశేషంగా పూజాదికాలు జరిపారు . ఉత్సవాలలో ప్రతిరోజు కూడా ఈ వరసిద్ధి వినాయకస్వామివారికి విశేష పూజాదికాలు వుంటాయి
ఉచిత సామూహిక సేవలు
ధర్మప్రచారంలో భాగంగా దేవస్థానం ఈ రోజు వినాయకచవితి పురస్కరించుకుని ఉచిత సామూహిక సేవలలో భాగంగా గణపతిపూజ నిర్వహించింది.
తెల్లరేషన్కార్డు కలిగిన వారి సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఉచిత సామూహిక సేవలలో భాగంగా ఈ రోజు (07.09.2024) చంద్రవతి కల్యాణ మండపంలో గణపతిపూజను నిర్వహించారు. విజయవాడ, హైదరాబాద్, చెన్నై, తాడిపత్రి, అద్దంకి, ఖమ్మం, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ ఉచిత సామూహిక పూజలలో పాల్గొన్నారు.