బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ వీలైనంత త్వరగా, నాణ్యతగా పూర్తి చేయాలి-ఈ ఓ ఎం. శ్రీనివాసరావు

 శ్రీశైల దేవస్థానం:  *మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు * ఏర్పాట్ల పనుల పురోగతిని సమీక్షించిన కార్యనిర్వహణాధికారి * మంచినీటి సరఫరా పకడ్బందీగా ఉండాలని ఆదేశం * ప్రణాళికబద్ధంగా క్యూలైన్ల నిర్వహణ *

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు జరుగనున్నాయి.  11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు  చేయనున్న ఆయా ఏర్పాట్లకు సంబంధించిన పురోగతిని కార్యనిర్వహణాధికారి  ఎం. శ్రీనివాసరావు బుధవారం  సాయంకాలం సమీక్షించారు.ఇంజనీరింగ్ అధికారులు, అన్నివిభాగాల శాఖాధిపతులు, అన్ని విభాగాల పర్యవేక్షకులు సమీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈ ఓ  మాట్లాడుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా పనులలో పూర్తి నాణ్యత ఉండాలన్నారు.

బ్రహ్మోత్సవాలు 19వ తేదీన ప్రారంభమవుతున్నప్పటికీ భక్తులరద్దీ మూడు నాలుగు రోజుల ముందు నుంచే ఉండే అవకాశం ఉందన్నారు.

ఇప్పటికే రూపొందించిన ప్రణాళికలను అనుసరించి బ్రహ్మోత్సవాలలో ఆయా దర్శనం క్యూలైన్లను నిర్వహించాలన్నారు. క్యూలైన్ల నిర్వహణలో పోలీస్ శాఖ వారి పూర్తి సహాయ సహకారాలను పొందాలన్నారు. క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు.

 శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు, జ్యోతిర్ముడి సమర్పణకు చేయాల్సిన ఏర్పాట్లన్ని కూడా ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు.

రద్దీని బట్టి మరిన్ని అదనపు ప్రసాదాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆయా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

అన్ని విభాగాల సిబ్బంది అందరు కూడా సమాచార వినిమయలోపం లేకుండా సమిష్టిగా పరస్పర సమన్వయంతో ఉత్సవ నిర్వహణలో విధులు నిర్వహించాలన్నారు.

రోజు జరిగే శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవంలో తగు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.

ముఖ్యంగా మహాశివరాత్రి రోజైన ఫిబ్రవరి 26న జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, ఆ మరునాడు జరిగే రథోత్సవం, తెప్పోత్సవం తదితర కార్యక్రమాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.

పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్దచెరువు, భీముని కొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి మొదలైన చోట్ల చేయవలసిన ఏర్పాట్లన్నీ ముందస్తుగానే పూర్తి కావాలన్నారు. అడవి మార్గంలో చేసే ఆయా ఏర్పాట్లలో అటవీశాఖ వారితో సమన్వయం చేసుకోవాలన్నారు.

అన్నప్రసాదాలు శుచీ శుభ్రతలతో రుచికరంగా ఉండేవిధంగా తయారు చేయాలని అన్నప్రసాద విభాగాన్ని ఆదేశించారు. ముఖ్యంగా తాజా కూరగాయలనే వినియోగించాలన్నారు.భక్తులరద్దీకనుగుణంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగించేవిధంగా పారిశుద్ధ్య ఏర్పాట్లు ఉండాలన్నారు.

ఈ సమావేశంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, పి. మురళీబాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, పలు విభాగాల సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.