
శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా శని,ఆదివారాలలో, పర్వదినాలలో భక్తులు అధికసంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. ఈ రోజులలో వాహనాల సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది.
అందుకే క్షేత్రపరిధిలో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేవిధంగా విశాలమైన వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అదేవిధంగా క్షేత్రాన్ని సందర్శించే సాధారణ భక్తులకు వసతి కల్పించేందుకు దాతల సహకారం తో డార్మెటరీలను కూడా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇందులో భాగంగా పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటుకు, డార్మెటరీ నిర్మాణాల కోసం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న ఈ రోజు (09.10.2021) న స్థలపరిశీలన చేసారు.
ఈ పరిశీలనలో గణేశసదనం ఎదురుగా విశాలమైన ప్రదేశములో శాశ్వత ప్రాతిపదికన పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అదేవిధంగా రింగ్ రోడ్డు ఇరువైపులా గల పలు ప్రదేశాలను కూడా పరిశీలించారు.
ఇక డార్మెటరీ నిర్మాణాలకు కూడా రింగ్ రోడ్డుకు సమీపంలో గల పలు ప్రదేశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ అవసరాల నిమిత్తం మరిన్ని పుష్పవనాలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా నక్షత్రవనానికి ఎడమవైపు ప్రాంతములో గులాబి, మందార, కనకాంబరం, మల్లెలు మొదలైన పూలమొక్కలు పెంచేందుకు ఉద్యానవన ఏర్పాటుకు అంచనాలను రూపొందించాలన్నారు. అదేవిధంగా ఈ ప్రదేశములో బిల్వం, అరటి, మామిడి మొక్కలను కూడా విరివిగా పెంచేందుకు తగు ప్రణాళికలు రూపొందించాలన్నారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మురళీ బాలకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.