శ్రీశైల కాలిబాట మార్గం ఏర్పాట్ల పై అటవీశాఖ అధికారులతో చర్చిస్తాం -ఈ ఓ
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల కాలిబాట మార్గం ( నాగలూటి, పెచ్చెర్వు, భీమునికొలను, కైలాసద్వారం ) ఏర్పాట్ల పై అటవీశాఖ అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని కార్యనిర్వహణాధికారి ఎస్ .లవన్న తెలిపారు. శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ఈ ఓ బుధవారం డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది.
దేవస్థానం పరిపాలనా విభాగం లోని సమీక్షా సమావేశ మందిరం లో జరిగిన కార్యక్రమం లో పలువురు భక్తులు కార్యాలయానికి ఫోన్ ద్వారా సూచనలు, సలహాలు అందజేశారు.హైదరాబాద్, పాణ్యం, బెంగుళూరు, ఆత్మకూరు, ఒంగోలు తదితర ప్రదేశాల నుంచి భక్తులు పాల్గొన్నారు.
ఒక భక్తుడు స్వామివారి స్పర్శదర్శనం గురించి అడిగారు. రాష్ట్ర దేవదాయశాఖ మార్గదర్శకాలకు అనుసరించి కోవిడ్ నియంత్రణ చర్యలలో భాగంగానే తాత్కాలికంగా స్పర్శదర్శనం నిలుపుదల చేశామమని ఈ ఓ వివరించారు. మరో భక్తుడు మాట్లాడుతూ శ్రీశైల కాలిబాట మార్గం ( నాగలూటి, పెచ్చెర్వు, భీమునికొలను, కైలాసద్వారం ) ఏర్పాట్ల గురించి సూచనలు చేశారు. అటవీశాఖ అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని ఈ ఓ అన్నారు.
మరికొందరు భక్తులు మాట్లాడుతూ ఆలయ ప్రాంగణములోని పరివార ఆలయాలలో (వృద్ధమల్లికార్జునస్వామివారి ఆలయం లో) కూడా అర్చనలకు అవకాశం కల్పించాలన్నారు. అందుకు కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ కరోనా నివారణ చర్యలలో భాగంగా ప్రస్తుతానికి పరివార ఆలయాలలో కూడా భక్తులకు దర్శనానికి మాత్రమే అనుమతించామన్నారు.
హైదరాబాద్ నుంచి భక్తురాలు మాట్లాడుతూ వసతి సౌకర్య కల్పన గురించి సూచనలు చేసారు.
కార్యక్రమం లో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
భక్తులు తెలియజేసిన సూచనలు, సలహాల గురించి అధికారులతో కార్యనిర్వహణాధికారి సమీక్షించారు.
Post Comment