శ్రీశైలదేవస్థానం:దసరా మహోత్సవాలు సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. పదకొండు రోజులపాటు జరిగే ఈ మహోత్సవాలు అక్టోబరు 2 తేదీతో ముగియనున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజలు, శ్రీ అమ్మవారికి విశేష అలంకరణలు, ప్రత్యేక నవావరణ పూజలు, స్వామిఅమ్మవార్లకు వాహనసేవలు, చండీహోమం, రుద్రహోమం, జపములు, పారాయణలు జరుగుతాయి.
ఆలయ ప్రవేశం :
ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు దంపతులు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అర్చక స్వాములు, వేదపండితులు, అధికారులు ఆలయ ప్రవేశం చేశారు. సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలు, ఫలపుష్పాదులతో ఆలయ ప్రవేశం చేశారు
ఈ ఉత్సవాలకు నాందిగా ఉదయం 9.00 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం, గణపతిపూజ, దీక్షాసంకల్పం, కంకణపూజ, కంకణధారణ, ఋత్విగ్వరణం కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం అమ్మవారి యాగశాలలో అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, చండీ కలశ స్థాపన, శ్రీచక్రార్చన, నవగ్రహజపాలు, చతుర్వేద పారాయణలు, చండీ సప్తశతి, మహావిద్యా పారాయణలు, సూర్యనమస్కారాలు జరిగాయి.
స్వామివారి యాగశాలలో యాగశాల ప్రవేశం, గణపతిపూజ, శివసంకల్పం, అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, రుద్రకలశస్థాపన కార్యక్రమాలు జరిగాయి.
ఉత్సవ సంకల్పం :
ఉత్సవ సంకల్పంలో, అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలములో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, దేశం సుభిక్షంగా ఉండి, సుఖశాంతులు విలసిల్లాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని కోరారు.
గణపతిపూజ :
ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు.
కంకణపూజ – కంకణ ధారణ :
గణపతి పూజ తరువాత కంకణాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు.
అనంతరం కంకణధారణ జరిగింది.
ఋత్విగ్వరణం :
కంకణ ధారణ తరువాత ఋత్విగ్వరణం నిర్వహించారు. ఉత్సవాలలో ఆయా వైదిక కార్యాలను నిర్వహించాలని ఋత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్షా వస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు.
అమ్మవారి యాగశాలలో కార్యక్రమాలు:
తరువాత అమ్మవారి యాగశాలలో పుణ్యాహవాచనం, అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, చండీకలశస్థాపన, శ్రీచక్రార్చన జరిపించారు. అమ్మవారికి నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు జరిపారు
స్వామివారి యాగశాలలో కార్యక్రమాలు :
ఈ ఉదయం శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ, ఋత్విగ్వరణం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధన, రుద్రకలశస్థాపన, జరిపించారు.
రుద్రహోమం – చండీహోమం :
ఉత్సవాలలో భాగంగా ప్రతీరోజు లోక కల్యాణార్థం రుద్రహోమం, చండీహోమం కార్యక్రమాలు ప్రత్యేకం.
కుమారి పూజ :
దసరామహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారి పూజలు ప్రత్యేకం.
ఈ కుమారిపూజలో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికకు పూలు, పండ్లు, నూతనవస్త్రాలను సమర్పించి పూజించడం జరుగుతోంది. కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం.
పారాయణలు:
ఉత్సవాలను పురస్కరించుకుని లోకకల్యణం కోసం చతుర్వేదపారాయణలు, నవగ్రహజపాలు, చండీ సప్తశతిపారాయణ, మహా విద్యాపారాయణ, సూర్యనమస్కారాలు ప్రత్యేకం.
సాయంకాల కార్యక్రమాలు :
ఉత్సవాలలో భాగంగా ఈ సాయంకాలం అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన కార్యక్రమాలు
జరిపించబడుతాయి.
శైలపుత్రి అలంకారం:
ఈ నవరాత్రి మహోత్సవాలలో నవదుర్గ అలంకారంలో భాగంగా ఈ సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని శైలపుత్రి స్వరూపంలో అలంకరింపజేయడం ప్రత్యేకం. ద్విభుజాలను కలిగిన ఈదేవి కుడిచేతిలో త్రిశూలాన్ని, ఎడమచేతిలో పద్మాన్ని ధరించి ఉంటుంది. నవదుర్గలలో ప్రథమ రూపమైన ఈదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలగడంతో పాటు సర్వత్రా విజయాలు లభిస్తాయని చెప్పబడుతోంది.ముఖ్యంగా ఈ దేవీ ఆరాధన వలన కోరికలు సిద్ధిస్తాయని, ముత్తైదువులకు ఐదవతనం వృద్ధి చెందుతుందని చెప్పబడుతోంది.
భృంగివాహనసేవ:
ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు భృంగివాహనసేవ ప్రత్యేకం . ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి భృంగి వాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు చేయడం ప్రత్యేకం.
