దుకాణదారులు bio degradable క్యారీ బ్యాగులు వినియోగించాలి : టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2021 డిసెంబరు 29: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా సంపూర్ణంగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నామని, దుకాణాల నిర్వాహకులు భక్తులకు అందించేందుకు bio degradable క్యారీ బ్యాగులు వినియోగించాలని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి కోరారు. తిరుమల ఆస్థాన మండపంలో బుధవారం దుకాణాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలలో ఇటీవల సర్వే చేశామని, ఇంకా పలు దుకాణాల్లో ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, ప్యాకింగ్ వినియోగిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. మూడు నెలల గడువు ఇస్తున్నామని, అందరూ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ షాంపూ ప్యాకెట్లు కూడా విక్రయించరాదని, సబ్బులపై బయోడిగ్రేడబుల్ కవర్లు ఉండాలన్నారు. గుట్కా, పొగాకు ఉత్పత్తుల నిషేధం పూర్తిగా అమలవుతోందని, ప్లాస్టిక్ నిషేధాన్ని కూడా ఇదేవిధంగా అమలుచేయాలని చెప్పారు. దుకాణాల వద్ద అనధికార ఆక్రమణలు లేకుండా చూడాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులు నిర్దేశించిన విధంగా అన్ని దుకాణాలు ఒకే కనిపించేలా షెల్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అన్ని దుకాణాల లైసెన్సులను పరిశీలించామని, అనధికారికంగా నిర్వహిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని అదనపు ఈవో తెలిపారు. బేడి ఆంజనేయస్వామివారి ఆలయం, సబ్ వే ప్రాంతాల్లో ఉన్న దుకాణదారుల సమస్యను పరిష్కరించామని, అదేవిధంగా, పాపవినాశనం రోడ్డులోని దుకాణదారుల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. నిర్వాసితులకు దుకాణాలు కేటాయించే స్కీమ్ 2011వ సంవత్సరంలోనే ముగిసిందని తెలియజేశారు. అనంతరం పలువురు దుకాణదారులు తెలిపిన సమస్యలను పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్ఇ-2 జగదీశ్వర్రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ఎస్టేట్ అధికారి మల్లికార్జున, డిఎఫ్వో శ్రీనివాసులురెడ్డి, విజివో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post Comment