శ్రీశైల దేవస్థానం:సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం సోమవారం వేకువజామున “భోగిమంటలు” కార్యక్రమాన్ని నిర్వహించింది.
ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ కార్యక్రమం జరిగింది.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, శ్రీస్వామివారి ఆలయ ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, పలువురు అర్చకస్వాములు, స్వామివారి ఆలయ పర్యవేక్షకులు ఎం. హరియనాయక్, భద్రతవిభాగం పర్యవేక్షకులు ( ముఖ్య భద్రతాధికారి) సి. మధుసూదన్రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు.
అనంతరం సంప్రదాయబద్ధంగా పిడకలు, ఎండుగడ్డి, వంటచెరుకుని వేసి “భోగిమంటలు” వేశారు.
సంక్రాంతి సందర్భంగా వేసే భోగిమంటలకు మన సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ భోగిమంటలు వేయడం వలన దుష్టపీడలు విరగడై, అమంగళాలు తొలగి సకలశుభాలు కలుగుతాయని నమ్మకం.
ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాలపై అందరికీ మరింత అవగాహన కల్పించాలనే భావనతో ఏటా దేవస్థానం ఈ భోగిమంటల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.