
శ్రీశైల దేవస్థానం:దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి సోమవారం నుంచి మూడు రోజులపాటు శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి.. చంద్రవతి కల్యాణ మండపంలో ఈ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ఆలయ భద్రతా విధుల పట్ల సిబ్బందికి మరింత అవగాహన కలిగించేందుకు వారిని శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసినదిగా దేవస్థానంకోరింది.తదనుగుణంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అథిరాజ్ సింగ్ రాణా .ఆత్మకూరు డీఎస్పీ ఆర్.రామాంజీనాయక్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖవారు ఈ శిక్షణా కార్యక్రమంలో సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు.
స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. ప్రసాదరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ మంజునాథ్ తదితర పోలీస్ సిబ్బంది ఈ శిక్షణా కార్యక్రమములో భద్రతా చర్యలకు సంబంధించిన అంశాలను సిబ్బందికి తెలియచెబుతున్నారు.
ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారియం.శ్రీనివాసరావు మాట్లాడుతూ. శ్రీశైలక్షేత్రాన్ని ప్రతీరోజు వేలాది సంఖ్యలో భక్తులు దర్శించడం జరుగుతోందన్నారు. అందుకే క్షేత్ర భద్రత అనేది ఎంతో ప్రాముఖ్యత గల అంశామన్నారు. ఈ కారణంగా భద్రతా సిబ్బంది విధినిర్వహణ భగవంతునిసేవగా భావించాలన్నారు. విధినిర్వహణ సమయంలో పూర్తి అప్రమత్తతో ఉండాలన్నారు. భద్రతా సిబ్బంది తమ విధినిర్వహణకు మానవత్వాన్ని కూడా జోడించాలన్నారు. అప్పుడే క్షేత్రాన్ని సందర్శించే భక్తులు సంతృప్తికరమైన సేవలు పొందగలరన్నారు.
ముఖ్యంగా క్షేత్రాన్ని సందర్శించే ప్రతి భక్తుడిని అతిథిగా భావించాలన్నారు. సిబ్బంది వారికి నిర్దేశించిన ప్రదేశాలలో విధులు నిర్వహిస్తున్నప్పుడు భక్తులతో పూర్తి మర్యాదగా మెలగాలన్నారు. ముఖ్యంగా విధులలో ఉన్న భద్రతా సిబ్బంది భక్తులు అడిగే సాధారణ సమాచారాన్ని కూడా అందించాలన్నారు.
అదేవిధంగా భద్రతా చర్యలతో పాటు క్షేత్ర పవిత్రతను కాపాడే భద్రత కూడా భద్రతా సిబ్బందిపై ఉంటుందన్నారు.
టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహించేటప్పుడు ఎంతో పకద్బందీగా తనిఖీలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఆలయంలో దర్శన క్యూలైన్ల నిర్వహణ, రద్దీక్రమబద్దీకరణ, వాహన రాకపోకల క్రమబద్దీకరణ, వాహన పార్కింగ్ ప్రదేశాలు మొదలైనచోట్ల అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు.
ఉత్సవాల సమయంలో ఉండే భక్తులరద్దీని అనుసరించి భద్రతా సిబ్బంది మరింత జాగ్రత్తతో విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
గ్రామోత్సవం, ప్రభోత్సవం, రథోత్సవాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రణాళికబద్ధంగా తగు జాగ్రత్తలు వహించాలన్నారు. ఆయా ఉత్సవాలలో భక్తులు వీక్షించేవిధంగా తగు ముందస్తు ఏర్పాట్లు ఉండాలన్నారు.
అనంతరం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ దేవదాయ ధర్మదాయచట్టాన్ని అమలు చేసే విషయానికి సంబంధించిన పలు అంశాలను వివరించారు.
భద్రతా సిబ్బంది అందరూ కూడా క్రమశిక్షణతో మెలుగుతూ విధినిర్వహణపట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా ఎవరికి వారు స్వీయనియంత్రణ కలిగివుండాలన్నారు.
భద్రతా విధులు నిర్వహించే సిబ్బంది ఎప్పటికప్పుడు సంయమనం పాటించాలని, ఆవేశానికి లోనుకాకుండా ఉండాలని సూచించారు. దేహదారుఢ్యాన్ని కలిగివుండేందుకుగాను భద్రతా సిబ్బంది తగు వ్యాయామాన్ని కూడా చేయడం ఎంతో అవసరమన్నారు.
ఈ కార్యక్రమములో పర్యవేక్షకులు కె. అయ్యన్న తదితర సిబ్బంది పాల్గొన్నారు.