
శ్రీశైల దేవస్థానం:శనివారం మధ్యాహ్నం నుండి అమావాస్య ఘడియలు రావడంతో శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామి వారికి ఈ సాయంకాలం విశేషార్చన జరిగింది.
ప్రతీ మంగళవారం, అమావాస్య రోజులలో ఈ విశేషార్చనను జరిపిస్తున్నారు.
కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం ఉంది.
ఈ రోజు పరోక్షసేవ ద్వారా 22 మంది భక్తులు ఈ విశేషపూజలను జరిపించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు ఈ పూజలను జరిపించుకుంటున్నారు.
కాగా ఈ పూజాదికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను
జరిపారు.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం జరిపారు.
ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించ బడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
ఈ పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు సేవారుసుమును www.srisailadevasthanam.org, aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
కాగా ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలుపుతారు.
సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి / యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును.
భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరింది. ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351 / 52 / 53 / 54 /55/ 56 లను సంప్రదించవచ్చును.