
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానంలో శాకంభరీ ఉత్సవానికి భారీ ఏర్పాట్లు చేసామని ఈఓ కే ఎస్.రామరావు తెలిపారు. ఆషాఢపౌర్ణమి సందర్బంగా (24.07.2021) న శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి నిర్వహించనున్న శాకంభరీ ఉత్సవానికి తగు ఏర్పాట్లన్నీ చేసారు.ఇందుకోసం అవసరమైన సుమారు 4వేల కేజీలకు పైగా వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలను, వివిధ రకాల ఫలాలను తెప్పించారు.
దేవస్థానం సూచనల మేరకు పలువురు దాతలు వీటిని విరాళంగా సమర్పించారు.
వంగ,బెండ, దొండ, కాకర, చిక్కుడు, గోరుచిక్కుడు, మునగ, సొర, బీర, గుమ్మడి, బంగాళదుంప, కందదుంప, క్యాప్సికమ్ (బెంగుళూరు మిరప), క్యాబేజీ, బీన్స్, క్యారెట్, అరటి మొదలైన వివిధ రకాల కూరగాయలు, తోటకూర,పాలకూర, మెంతికూర, చుక్కకూర, మొదలైన పలురకాల ఆకుకూరలు, పుదిన, కరివేపాకు, కొత్తిమీర లాంటి సుగంధ పత్రాలు, కమల, బత్తాయి, ద్రాక్ష, ఆపిల్, అరటి, ఫైనాపిల్ మొదలైన పలురకాల ఫలాలు, నిమ్మకాయలు, బాదంకాయలు మొదలైన వాటిని ఈ ఉత్సవానికి తెప్పించారు.
అదే విధంగా ఈ ఉత్సవంలో భాగంగానే శ్రీ భ్రమరాంబాదేవి వారికి విశేషపూజలు జరుగుతాయి.
ఈ ఉత్సవంలో శ్రీ అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలతోనూ, ఆకుకూరలతోనూ, పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరిస్తారు. అదేవిధంగా అమ్మవారికి విశేషపూజలు వుంటాయి. ఇంకా దేవాలయ ప్రాంగణాన్ని కూడా పలు రకాల ఆకుకూరలు, కూరగాయాలతో అలంకరిస్తారు.
ఈ ఉత్సవంలో భాగంగానే శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తికి, ఆలయప్రాంగణంలోని రాజరాజేశ్వరి దేవికి, సప్తమాతృకలను, గ్రామదేవత అంకాళమ్మకు ప్రత్యేకపూజలు విశేషంగా శాకాలంకరణ చేస్తారు
ఈ విధంగా అమ్మవారిని శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని, కరువుకాటకాలు నివారించ బడతాయిని పురాణాలు చెబుతున్నాయి.
పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్జానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువుకాటకాలతో తీవ్రక్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణకోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసింది.
ఈ సందర్భంలోనే జగన్మాత తన నుండి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు ఫలాలు మొదలైన శాకాలను సృష్టించి,
క్షామాన్ని నివారించింది. ఆ విధంగా అవతరించిన ఆ పరాశక్తి స్వరూపమే శాకంభరీదేవి.
ఈ కారణంగానే ఆషాఢ పౌర్ణమిరోజున అమ్మవారిని శాకాలతో అలంకరించి ఆర్చించే సంప్రదాయం ఏర్పడింది.