శ్రీశైల దేవస్థానం:
*కుంభోత్సవ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం
• ఏప్రియల్ 7న శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం
• సాత్వికబలిగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నరాసి సమర్పణ
• కుంభోత్సవ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
• ప్రణాళికాబద్దంగా క్యూలైన్ల నిర్వహణ
ఏప్రియల్ 7వ తేదీన శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరుగనున్నది.
సాత్వికబలిగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నరాసిని సమర్పించేందుకు ఈ వార్షిక కుంభోత్సవం జరుగుతుంది .
కుంభోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు బుధవారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
దేవస్థానం వైదిక సిబ్బంది, శాఖాధిపతులు, అన్ని విభాగాల పర్యవేక్షకులతో పాటు స్థానిక తహశీల్దార్ కె.వి. శ్రీనివాసులు, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగనాథ్ బాబు, వన్టౌన్ పోలీస్స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ బి.వి. సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ముఖ్యంగా కుంభోత్సవంలో ఆయా కైంకర్యాలన్నింటినీ పరిపూర్ణంగా జరిపించాలని వైదిక సిబ్బందికి సూచించారు.
కుంభోత్సవం రోజు సాయంకాలం అమ్మవారి దర్శనాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ సమయాన క్యూ లైన్లలో తొక్కిసలాట లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని దేవస్థాన భద్రతా విభాగపు పర్యవేక్షకులను ఆదేశించారు
కుంభోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయ మెట్లమార్గంలో అదనపు క్యూలైన్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. క్యూలైన్ల నిర్వహణ ప్రణాళికబద్దంగా ఉండాలన్నారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు.
ఏప్రియల్ 8వ తేదీన ఉదయం గం.7.30ల నుంచి దర్శనాలు, ఆర్జితసేవలు మొదలయ్యేలాగున చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా దేవదాయ చట్టముననుసరించి క్షేత్ర పరిధిలో జంతు , పక్షి బలులు , జీవహింస పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. అందుకే పక్షి , జంతు బలుల నిషేధానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని, నిషేధం అమలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయమై భక్తులకు కూడా తగిన అవగాహన కల్పించాలన్నారు.
భక్తులలో అవగాహన కల్పించేందుకు ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా జంతుబలి నిషేధాన్ని గురించి విస్తృత ప్రచారం చేయవలసినదిగా ఆలయ , ప్రచార విభాగాలను ఆదేశించారు.
క్షేత్ర పరిధిలో జంతు, పక్షిబలి నిరోధానికి ప్రత్యేకం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమైన స్థానిక రెవెన్యూ , పోలీస్ శాఖల పూర్తి సహాయ సహకారాలను అందించాలని ఆ శాఖల స్థానిక అధికారులకు సూచించారు.
జంతుబలి నిషేధానికి పోలీస్ , రెవెన్యూ సిబ్బందిచేత తనిఖీ బృందాలను ( మోబైల్స్క్వాడ్) ఏర్పాటు చేయాలన్నారు.
అదేవిధంగా ఉత్సవ సమయంలో జంతు బలులు నిషేధానికి ప్రత్యేకంగా గస్తీని ఏర్పాటు చేయవలసినదిగా కూడా కార్యనిర్వహణాధికారి సూచించారు. ఇందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించవలసినదిగా స్థానికపోలీస్ అధికారులను కోరారు.
దేవస్థాన అధికారులకు, సిబ్బందికి కూడా గస్తీకి సంబంధించి ప్రత్యేక విధులను కేటాయించవలసినదిగా పరిపాలనా విభాగాన్ని ఆదేశించారు.
ముఖ్యంగా ఆలయ మాడవీధులు, ప్రధానద్వారాలు, అంకాళమ్మ ఆలయం, పంచమఠాల దగ్గర గల మహిషాసురమర్దిని, రుద్రాక్షమఠం వద్ద గల ఛిన్నమస్తాదేవి, పాతవర్క్షాప్ వద్ద గల సుంకులమ్మ, పాతాళగంగ మార్గ సమీపంలో వజ్రాల గంగమ్మ, టోల్గేట్ మొదలైన చోట్ల సిబ్బంది ప్రత్యేక విధులను నిర్వహించాలన్నారు.
అదేవిధంగా కుంభోత్సవం రోజుల్లో జంతువులను, పక్షులను బస్సులలో అనుమతించకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవలసినదిగా ఆర్.టి.సి. అధికారులను కోరడం జరుగుతుందన్నారు.
ఇంకా జంతుబలి నిషేధాన్ని పకడ్బందిగా అమలు చేసేందుకు దేవస్థానం టోల్గేట్ వద్ద ప్రత్యేక తనిఖీ ఏర్పాట్లు చేయవలసినదిగా స్థానిక రెవిన్యూ, పోలీస్ అధికారులకు సూచించారు. ఈ తనిఖీలకు దేవస్థానం కూడా తగు సిబ్బందిని ఏర్పాటు చేసి సహకరిస్తుందన్నారు.
అదేవిధంగా క్షేత్రపరిధిలో జంతుబలి నిషేధం గురించి అవగాహన కల్పించేందుకు పలుచోట్ల విస్తృతంగా బోర్డులను ఏర్పాటు చేయవలసినదిగా ఇంజనీరింగ్ , ప్రచురణల విభాగాన్ని ఆదేశించారు.
శ్రీశైలం ప్రాజెక్ట్లో కుంభోత్సవం ముందు రోజు , కుంభోత్సవం రోజు మద్యం అమ్మకాలను నిలిపివేసేందుకు తగు ఉత్తర్వులు ఇవ్వవలసినదిగా జిల్లా కలెక్టర్ కు విన్నవించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు.
