పరిసరాలన్ని శుభ్రంగా ఉండేందుకు నిరంతర పర్యవేక్షణ అవసరం-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబరు 12 వరకు కార్తిక మాసోత్సవాలు  జరుగుతాయి .భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ మాసోత్సవాలకు వివిధ  ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా శనివారం  ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి  డి.పెద్దిరాజు సంబంధిత అధికారులతో కలిసి క్యూలైన్లు, శీఘ్ర దర్శనం, అతిశీఘ్రదర్శన కౌంటర్లు, పార్కింగ్  ప్రదేశాలు, టూరిస్ట్‌ షెడ్డు, కల్యాణకట్ట, డార్మెటరీ మొదలైన వాటిని పరిశీలించారు.  గణేశ సదనమును కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా గణేశ సదన్‌ దినబాడుగ రాబడిని సమీక్షించారు.

ఈ పరిశీలన సందర్భంగా కార్తీక మాస ఏర్పాట్ల గురించి ముందుగా కార్యనిర్వహణాధికారి
ధర్మకర్తల మండలి అధ్యక్షుల కు  వివరించారు.

తరువాత ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ క్యూకాంప్లెక్స్‌లోని భక్తులకు నిరంతరం
మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు అందజేస్తుండాలన్నారు. క్యూలైన్లలో శుచీశుభ్రతకు ప్రాధాన్యత
ఇవ్వాలని అన్నారు. పార్కింగ్‌ ప్రదేశాలు, ఆయా  ప్రదేశాలకు చేరుకోవలసిన దారులు
స్పష్టంగా తెలిసేవిధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
ముఖ్యంగా ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రపరిధిలోని అన్ని శౌచాలయాల శుభ్రత
పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్భాలన్నారు. పాతాళగంగ మెట్లమార్గంలోని డార్మెటరీల దారి తెలిసేవిధంగా
పలుచోట్ల సూచిక బోర్జులను ఏర్పాటు చేయాలన్నారు. కల్యాణకట్టలో కేశఖండనానికి వచ్చే భక్తుల పట్ల
మర్యాదతో మెలగాలని అక్కడి సిబ్బందికి సూచించారు.

ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా కార్యనిర్వహణాధికారి  డి. పెద్దిరాజు మాట్లాడుతూ
ఆయా రోజులలో దర్శనం వేళలు, దర్శనానికి పట్టే సమయం మొదలైన సమాచారాన్ని ఆలయ
ప్రసారవ్యవస్థ ద్వారా నిరంతరం తెలియజేస్తుండాలన్నారు. క్యూలైన్ల వద్ద భక్తులకు సమాచారం
తెలిసేవిధంగా మరిన్ని సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పార్కింగు ప్రదేశాలలో కూడా
తగినంత స్థాయిలో విద్యుద్దీపాలు వెలిగే విధంగా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్‌ విభాగాన్ని
ఆదేశించారు. పార్కింగు ప్రదేశాలు, వాటి పరిసరాలన్ని శుభ్రంగా ఉండేందుకు నిరంతర పర్యవేక్షణ
ఉండాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.

కల్యాణకట్టలో కేశఖండానికి వచ్చే భక్తులు అధిక సమయం వేచివుండకుండా
అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కల్యాణకట్టను ఎప్పటికప్పుడు
పరిశుభ్రంగా ఉంచాలన్నారు. డార్మెటరీలలో విద్యుద్దీపాలు , ఫ్యాన్లు సజావుగా పనిచేసే
విధంగా నిరంతరం తనిఖీలు చేస్తుండాలని ఇంజనీరింగ్‌ విభాగాన్ని ఆదేశించారు.

కార్తిక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని రథశాలకు కుడివైపున శివవీధిలో చలువపందిర్లు
వేయాలని నిర్ణయించారు.అదేవిధంగా టూరిస్ట్‌ షెడ్ల ముందుభాగంలో ( బి.టి. రహదారికి కుడివైపు భాగంలో ) సిమెంట్‌
కాంక్రీట్‌ ఫ్లోరింగు వేయాలని నిర్ణయించారు. ఈ కాంక్రీట్‌ ఫ్లోరింగు వేసేందుకు
అంచనాలను రూపొందించాలని ఇంజనీరింగ్‌ అధికారులను ధర్మకర్తల మండలి అధ్యక్షులు
కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.

ఈ పరిశీలనలో సహాయ కార్యనిర్వహణాధికారులు ఎం. ఫణిధర ప్రసాద్‌, ఎం. హరిదాసు,
పర్యవేక్షకులు టి. హిమబిందు, కె. అయ్యన్న, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీరు (ఐ /ని) పి.వి. సుబ్బారెడ్డి,
సహాయ ఇంజనీర్లు భవన్‌, చిరంజీవి, ఉద్యానవన అధికారి లోకేష్‌ , ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.