హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న మీడియా అకాడమీ భవనాన్ని త్వరగా పూర్తిచేయాలని, వచ్చే దసరా పండుగ లోపు ఆర్ అండ్ బి అధికారులు పనులన్నీ పూర్తిచేస్తే ముఖ్యమంత్రి చేతులమీదుగా భవన ప్రారంభ కార్యక్రమం చేస్తామని అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. 2015లో రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా అకాడమీని సందర్శించినప్పుడు అది ఒక పాత భవనం. సొంత భవనం నిర్మించుకోవడానికి, ఆయన 15 కోట్లు మంజూరు చేశారని, తాను ఇటీవల ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు భవన పురోగతి గురించి వివరించానని, వచ్చే దసరాకు సెక్రటేరియట్ , అమరవీరుల స్థూపంతోపాటు , మీడియా అకాడమీ భవనం కూడా ప్రారంభించాలని తాను చేసిన విజ్ఞప్తిని ఆయన అంగీకరించారని తెలిపారు. కరోనాకాలంలో నిర్మాణ పనులు కొంత కుంటుబడ్డ మళ్లీ పనులను వేగవంతం చేశామని ఆయన తెలియజేశారు.
నాంపల్లి లో ఉన్న అకాడమీ భవన నిర్మాణ పురోగతిని ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్ తో ఆయన సమీక్షించారు. సమీక్షానంతరం ఆర్ అండ్ బి అధికారులు భవనాన్ని సెప్టెంబర్ ఆఖరు తేదీలోపు పూర్తి చేసి అప్పగించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అకాడమీ నూతన భవనంలో ఒక ఆడిటోరియం, రెండు తరగతి గదులు , లైబ్రరీ ఉంటాయని , గ్రామీణ, డెస్క్ విలేకరులకు కోసం ఒక బ్రిడ్జ్ కోర్స్ రూపొందించి సర్టిఫికెట్ కోర్స్ ప్రారంభిస్తామని తెలిపారు.
భవన నిర్మాణ పనుల పరిశీలన, సమీక్ష లో అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బి ఇంజనీర్లు మహమ్మద్ ఆఫీస్, ఎస్సీ , నర్సింగ్ రావు, ఈ ఈ, మాధవి, డిప్యూటీ ఇంజనీర్, నితిన్, ఏ ఈ, కాంట్రాక్టర్ , అకాడమీ మేనేజర్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.