శ్రీశైల దేవస్థానం:జనవరి 3న లోకకల్యాణం కోసం శ్రీ స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహిస్తారు.
ఈ ఆరుద్రోత్సవాన్ని ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవం జరుగుతుంది.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని 2వ తేదీ రాత్రి 10 గంటల నుండి శ్రీస్వామివారికి మహాన్యాస పారాయణ, లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, మరునాడు 3 తేదీన తెల్లవారుజామున శ్రీస్వామిఅమ్మవార్ల ప్రాత:కాల పూజల అనంతరం నందివాహన సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు.
ఈ ఉత్సవంలో భాగంగా 2వ తేదీ రాత్రి గం.10.00లకు ఉత్సవం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా గణపతిపూజ చేస్తారు. తరువాత లోక కల్యాణం కోసం నిర్వహించబడే ఈ ఉత్సవ సంకల్పంలో దేశం సుభిక్షంగా ఉండాలని, దేశంలో సుఖశాంతులు విలసిల్లాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని, జనులందరికి సుఖసంతోషాలు కలగాలని, సంకల్పం చేస్తారు. అనంతరం శ్రీస్వామివారికి మహాన్యాస పారాయణ, లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం చేయబడుతుంది. ఆ తరువాత పంచామృతాలతోనూ, పలు రకాల ఫలోదకాలతోనూ, ఆలయ ప్రాంగణంలోని మల్లికాగుండ పుణ్యజలంతోనూ ఈ అభిషేకం ఎంతో శాస్త్రోక్తంగా జరిపిస్తారు. ఆలయ అర్చకులు, వేదపండితులు రుద్రమంత్రాలను పఠిస్తూ ఈ అభిషేకాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. తరువాత స్వామివారికి అన్నాభిషేకం జరిపించబడుతుంది.
అనంతరం పలు రకాల పుష్పాలతో, బిల్వదళాలతో శ్రీస్వామివారికి విశేషపూజలు చేస్తారు.
కాగా 3వతేదీన వేకువజామున గం.3.00లకు మంగళవాయిద్యాల అనంతరం గం. 3.30 ని!!లకు సుప్రభాతసేవ నిర్వహించబడుతుంది. తరువాత శ్రీస్వామిఅమ్మవార్లకు ప్రాత:కాలపూజలు, మహామంగళ హారతులను జరిపించిన అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీస్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా వేంచేబు చేయించి ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత ముఖమండప ఉత్తర ద్వారాన్ని తెరచి భక్తులకు ఉత్సవమూర్తుల ఉత్తరద్వార దర్శనం కల్పిస్తారు.
ఈ ఉత్సవంలో భాగంగానే ఉత్సవమూర్తులను శ్రీస్వామివారి ఆలయ ముఖమండప ఉత్తరద్వారం నుండి వెలుపలకు తోడ్కొనివచ్చి ఆలయ ఉత్తరభాగంలోనే నందివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేస్తారు.
తరువాత గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు , బయలువీరభద్రస్వామి మండపం వరకు గ్రామోత్సం నిర్వహిస్తారు.
