శ్రీశైల దేవస్థానం:మహాకుంభాభిషేక మహోత్సవంలో లోటుపాట్లు లేకుండా సిబ్బంది వారి వారి విధులు నిర్వర్తించాలని
రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ ఆదేశించారు. మహాకుంభాభిషేకం ఏర్పాట్లను మంగళవారం సమీక్షించారు.
అన్నప్రసాద వితరణ భవన సముదాయం లోని కమాండ్ కంట్రోల్ రూమ్ సమావేశ మందిరం లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
కుంభాభిషేకమహోత్సవానికి సంబంధించిన ఆయా ఏర్పాట్లను గురించి ఈ ఓ వివరించారు. సిబ్బంది అందరు కూడా వారివారికి అప్పగించిన ప్రత్యేక విధులను బాధ్యతాయుతంగాను, సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇప్పటికే రూపొందించుకున్న ప్రణాళికలను అనుసరించి సిబ్బంది అందరు కూడా వారి వారి విధులకు హాజరు కావాలన్నారు.
అనంతరం వైదిక కమిటీసభ్యులు మాట్లాడుతూ మహాకుంభాభిషేకానికి సంబంధించిన వైదిక కార్యక్రమాల గురించి తెలిపారు.
కమిషనర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ సిబ్బంది అందరు కూడా లోకకల్యాణం కోసం జరిపే ఈ కుంభాభిషేకమహోత్సవంలో పాల్గొనే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావించాలన్నారు. మహాకుంభాభిషేకమహోత్సవంలో పీఠాధిపతులు, పలువురు ప్రముఖులు పాల్గొంటున్నందున ఎటువంటి లోటుపాట్లు లేకుండా సిబ్బంది అందరు వారి వారి విధులు నిర్వర్తించాలన్నారు. ముఖ్యంగా సమయపాలనతో ఆయా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.ఆలయ ప్రాంగణములో కుంభాభిషేకం జరిగే గర్భాలయ విమానాలు, ఆలయ గోపురాలు, అన్ని ఉపాలయాల గోపురాలు, పరివార ఆలయాలు మొదలైన అన్నిచోట్ల కూడా దేవస్థానం సిబ్బందిని సమన్వయఅధికారులుగా నియమించాలన్నారు. ప్రతీ ప్రదేశంలో కూడా ఒక సమన్వయ అధికారి ఉండాలన్నారు.కుంభాభిషేక సమయములో ఆలయ వేళలు మొదలైనవాటిని ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తుండాలన్నారు.మహాకుంభాభిషేకాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా క్షేత్రపరిధిలో ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేసిన ఎల్.ఈ.డి. స్క్రీన్ల వివరాలను కూడా ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా భక్తులకు తెలియజేయాలన్నారు. ఈ మహాకుంభాభిషేక మహోత్సవాన్ని శ్రీశైలటీవి ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేసేలా చర్యలు ఉన్నాయన్నారు.అలాగే మిగతా చానల్స్ కూడా మహాకుంభాభిషేకాన్ని ప్రసారం చేసేవిధంగా శ్రీశైల టీవి ద్వారా క్లీన్ ఫీడును అందిస్తామన్నారు.