న్యూఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని కోరారు. ప్రధానమంత్రి మోడీతో సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు, రీసోర్స్ గ్యాప్ కింద నిధులు, విభజన హామీలు, ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై ప్రధానికి సీఎం వైయస్ జగన్ వినతిపత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహాయ, సహకారాలు అందించాలని విన్నవించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఇప్పటికే రూ.2900 కోట్లు ఖర్చు చేశామని, వాటిని రీయింబర్స్ చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. టెక్నికల్ అడ్వయిజర్ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని సీఎం వైయస్ జగన్ ప్రధానిని కోరారు.
అదే విధంగా పూర్తయిన పనులకు 15 రోజుల్లోగా రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. పోలవరం పనులను మరింత వేగంగా తీసుకెళ్లడానికి రూ.10 వేల కోట్లు ఇవ్వాలన్నారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని ప్రధాని ముందుlసీఎం వైయస్ జగన్ ప్రస్తావించారు. తెలంగాణ డిస్కంల నుంచి రూ.6,756 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, 8 ఏళ్లుగా సమస్య పరిష్కారం కాలేదని వివరించారు. ఆ నిధులు వెంటనే ఇప్పించాలని కోరారు. అదే విధంగా విభజన హామీలు అమలు చేయాలని కోరారు. మరో 12 మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేయాలని, కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని కోరారు. ఏపీఎండీసీకి బీచ్ శాండ్ మినరల్ ఏరియాలను కేటాయించాలని ప్రధానమంత్రి మోడీని సీఎం వైయస్ జగన్ కోరారు.