కర్నూలు, సెప్టెంబర్ 08 :-పరిశ్రమల అభివృద్ధితోనే జిల్లా ఆర్థికంగా మరింత పరిపుష్టి సాధించి యువతకు మెండైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందుతాయని కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పేర్కొన్నారు.
బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎంఎస్ ఎం ఈ, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ ,డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కమిటీ సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ…. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి భారీ చిన్న తరహా పరిశ్రమల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని ఆదేశించారన్నారు. జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధితో పాటు పరిశ్రమల అభివృద్ధి కూడా చాలా ముఖ్యమని, జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి పర్మిషన్స్, అప్రూవల్ లు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, జిల్లా యంత్రాంగం నుంచి పరిశ్రమలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. రైతులకు వ్యవసాయ పంట రుణాలు ఏ విధంగా రుణాలు ఇస్తున్నామో అదేవిధంగా పరిశ్రమలు కూడా విరివిగా రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఎల్ డిఎంను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమలకు కావలసిన భూ సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్ సెక్టార్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అడుగులు వేయాలని పారిశ్రామికవేత్తలను జిల్లా కలెక్టర్ సూచించారు.
పరిశ్రమలు నెలకొల్పేందుకు కావాల్సిన అనుమతులు రూల్ ప్రకారం ఉంటే పది రోజుల్లోగా చేయాల్సిన పనులను ఎనిమిది రోజుల్లోగా పూర్తి చేస్తామన్నారు. జిల్లా స్థాయిలో పరిశ్రమల పరంగా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు జిల్లా కలెక్టర్ సూచించారు. పరిశ్రమలకు జిల్లా పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే పొల్యూషన్, మైనింగ్, పరిశ్రమల శాఖ, తదితర శాఖల అధికారులు పరిశ్రమల అసోసియేషన్ లతో చర్చించి పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మెగా ఇండస్ట్రీస్ గ్రీనరీలో భాగంగా బ్యూటిఫికేషన్ పార్కు…టూరిస్ట్ పార్కులగా ఏర్పాటుకు ప్లాన్ చేయాలని పరిశ్రమల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ సూచించారు. పరిశ్రమలలో స్థానిక యువతకు ఉపాధి కల్పించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సానుకూల వాతావరణాన్ని కల్పించడంతో పాటు పారిశ్రామికవేత్తలకు సంపూర్ణంగా సహకారం అందిస్తామని భారీ చిన్న తరహా పరిశ్రమల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
స్టాండప్ ఇండియా పథకాల కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరిన్ని రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లతో పరిశ్రమల శాఖ జిఎం, లీడ్ జిల్లా మేనేజర్ మాట్లాడాలన్నారు జిల్లా కలెక్టర్ . అనుమతులకు సంబంధించి సింగల్ డెస్క్ పోర్టల్ లో (17-06-2021 To 08-09-2021) 97 దరఖాస్తులు రాగా, అందులో 82 దరఖాస్తులు నిర్దేశించిన గడువులోగా ఆమోదించడం జరిగిందని, మరో 12 అప్లికేషన్లు పురోగతిలో వున్నాయని, మరో 3 అప్లికేషన్లు తిరస్కరించడం జరిగిందన్నారు.. ఏ కారణంతో వాటిని తిరస్కరించడం జరిగిందో ఆ వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేయాలని జిఎం డిఐసిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
బనగానపల్లి యాగంటి రెడ్డి జీన్స్ పాంట్స్ గార్మెంట్ పరిశ్రమ 2015లో నెలకొల్పామని తమకు వంద మంది వరకు టైలర్లు కావాలని వారికి అకామిడేషన్ కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే జిల్లా కలెక్టర్ జెసిని డి ఆర్ డి ఎ అధికారులతో మాట్లాడి మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలన్నారు. తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామంలో జియో మైసూర్ సర్వీస్ ఇండియా గోల్డ్ మైనింగ్ కు హంద్రీ నుంచి నీటి సరఫరాకు రెన్యువల్ చేయాలని ఆ సంస్థ ప్రతినిధి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే జిల్లా కలెక్టర్ నీటి సరఫరా రెన్యువల్ ను కమిటీ ఆమోదించి సిఫార్సు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్యాపిలి మండలం క్లిoకర్ అండ్ డిఫరెంట్ గ్రేడ్స్ సిమెంట్ రైన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి ల్యాండ్ సర్వే చేసి హద్దులు చూపించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే జిల్లా కలెక్టర్ ల్యాండ్ సర్వే చేసి హద్దులును చూపించాలని సర్వే శాఖ ఏడిను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల పరంగా నమోదైన పరిశ్రమల స్థితిగతులపై ఆయన సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు వ్యక్తిగతంగా మాట్లాడి, వారి పరిశ్రమ లేదా సంస్థ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని సూచించారు. వారికి ఏమైనా సమస్యలు ఉంటే, వెంటనే వాటిని పరిష్కరించాలని చెప్పారు.
డిక్కీ కోఆర్డినేటర్ రాజ మహేంద్ర నాథ్, ఏపీఐఐసీ ఐలా సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు జి.రామకృష్ణారెడ్డి, దళిత ఇండస్ట్రియల్ అసోసియేషన్ జయన్న, బేతంచెర్ల స్లాబ్ పొలిషింగ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్, మినరల్స్ అసోసియేషన్ రాజశేఖరరావు, డోన్ అశ్విని బ్యాక్స్ ప్రతినిధి మోహన్, డోన్ ఎస్ జి గ్రానైట్ అసోసియేషన్ సత్యం గౌడ్, బనగానపల్లి యాగంటి రెడ్డి, కే మార్కాపురం డోర్స్ పరిశ్రమ అమృత రాజు, ఆదోని కాటన్ పరిశ్రమ అసోసియేషన్ ప్రతినిధులు ఎంఎస్ ఎం ఈ నుంచి మాట్లాడారు.
అదేవిధంగా లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ సంబంధించి కొలిమిగుండ్ల రాంకో సిమెంట్, తుగ్గలి మండలం, జొన్నగిరి జియో మైసూర్ సర్వీస్ ఇండియా, కోడుమూరు మినరల్స్ ఇండస్ట్రీస్, జూపాడు బంగ్లా తంగడంచ జైన్ ఇరిగేషన్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రతినిధి మౌలాలి, ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామం జై రాజ్ ప్రతినిధి శ్రీనివాస్ కుమార్, ప్యాపిలి మండలం రైన్ ఇండస్ట్రీస్, బనగానపల్లి జయ జ్యోతి సిమెంట్ ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు.
సమీక్షలో జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) ఎం.కె.వి.శ్రీనివాసులు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, నాబార్డు డిడిఎం పార్థసారథి, ఎల్ డిఎం వెంకట్ నారాయణ, ఏపీ ఐఐసి జెడ్ ఎమ్ వెంకట నారాయణమ్మ, Kuda Vc, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ, జిల్లా అధికారులు, ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.