జగిత్యాల నుంచే టిఆర్ఎస్ జైత్ర యాత్ర ,సెంచరీ కొడతాం, జగిత్యాల గెల్చుకొని కేసీఆర్ కు కానుకగా ఇస్తాం, జగిత్యాల నుంచి టిఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లను సాధిస్తామని, జగిత్యాల ను గెలుచుకొని కేసీఆర్ కు కానుకగా ఇస్తామని అన్నారు. బుధవారం జగిత్యాల నియోజకవర్గంలో 14 రోడ్ షో లో పాల్గొన్నారు. జగిత్యాల మండలం లోని ధరూర్, నర్సింగాపూర్, వంజర పల్లి, గొల్లపల్లి, వెల్దుర్తి, మోతే, చల్ గల్ మోర పల్లి గ్రామాల్లో రోడ్ షో లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాయికల్ మండలంలోని సింగరావు పేట, అల్లీపూర్, అయోధ్య, ఉప్పు మడుగు, కుమ్మర్ పల్లి, రాయికల్ మండల కేంద్రంలో ఎంపీ కవిత ప్రసంగించారు. సింగరావు పేట, అల్లీపూర్ లలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. పలుచోట్ల మహిళలు ఎంపీ కవిత కు మంగళ హారతులు ఇచ్చారు. రాయికల్ లో బంతిపూలతో ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, బాణాసంచా కాల్చుతూ టిఆర్ఎస్ కార్యకర్తలు ఆనందంతో డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ 30 ఏళ్లుగా జీవన్ రెడ్డి, ఎల్ రమణ లు ఎమ్మెల్యేలుగా పనిచేశారని, ఇన్నేళ్లు ఒకరినొకరు తిట్టుకున్నారు అవినీతికి పాల్పడ్డారని పరస్పరం ఆరోపణలు చేసుకున్న విషయం ఇంకా ప్రజలు ఇంకా మర్చిపోలేదు అన్నారు. కృష్ణా పుష్కరాల్లో తప్పిపోయిన కవల పిల్లల మాదిరిగా ఇప్పుడు ఒకటే ప్రేమ ఒలకబోస్తున్నారు అని అన్నారు. జగిత్యాలకు ఎనిమిది వందల కోట్ల రూపాయలను తెచ్చిన కేసిఆర్ ముద్దుల తనయ వాటి లెక్కలు చెప్పు అని జీవన్ రెడ్డి అడిగారని, లెక్కలు చెప్తే ఇప్పుడు చప్పుడు చేయడం లేదని అన్నారు. తాను కేసీఆర్ ముద్దుల తనయ నే కాదు.. తెలంగాణ ఉద్యమ తనయనని కవిత చెప్పారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కానీ ఆయన మాట మీద నిలబడరని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజల కడుపులో తలపెట్టి ఇదే ఆఖరి సారి అని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అన్న జీవన్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో పోటీ లో ఉన్నారని తెలిపారు రాజకీయ నాయకులు మాట మీద నిలబడాలి, అలా నిలబడలేని వారు ప్రజలకు ఏం చేస్తారని కవిత ప్రశ్నించారు. కూటమి పేరిట జట్టు కట్టిన కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, జన సమితి కేసీఆర్ ను గద్దె దించుతామంటున్నాయని చెప్పారు. అసలు కేసీఆర్ ను ఎందుకు గద్దె దించాలో చెప్పాలని కూటమి నాయకులను ప్రశ్నించాలని ప్రజలను ఎంపీ కవిత కోరారు. 24 గంటలు కరెంటు ఇస్తున్నందుకా, కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆడపిల్లల పెళ్లిళ్లు ఖర్చు భరిస్తున్నందుకా, కెసిఆర్ కిట్టు ద్వారా పేదింటి కడుపు పండిన నాటి నుంచి ప్రసవం అయ్యేంత వరకు 12 వేల రూపాయలు ఇస్తున్నందుకా, రైతుబంధు ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తూ న్నందుకా, హిందూ,ముస్లిం, క్రిస్టియన్లు కు పండుగలు పబ్బాలకు కొత్తబట్టలు పెడుతూ గౌరవంగా పండుగను జరుపుకునేందుకు సాయం చేస్తున్నందుకా, మౌలిక సదుపాయాల కల్పనకు పాటుపడుతున్నందుకా కేసీఆర్ ను గద్దె దించాలని కుంటున్నది..అని అడగాలని ఎంపి కవిత ప్రజలను కోరారు. అన్ని కులాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు కేసిఆర్ ,ఎన్నికలయ్యాక కార్యాచరణ తీసుకు వస్తారని తెలిపారు. రైతులకు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ ని చేస్తారని, నిరుద్యోగులకు 3000, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాన్ని, పెన్షన్ అర్హత వయసు ను 65 నుండి 58 ఏళ్ల కు తగ్గిస్తామని వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి జగిత్యాల లో సంజయ్ అన్నను గెలిపించాలని ఎంపీ కవిత ప్రజలను కోరారు. రోడ్ షోలలో టిఆర్ఎస్ జగిత్యాల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్, రమణారావు, చంద్రశేఖర్ గౌడ్, భోగ వెంకటేశ్వర్లు, చక్కిలం కిషన్ తదితరులు పాల్గొన్నారు.