శ్రీశైలదేవస్థానం:కార్తీకమాస శివదీక్షా విరమణ కార్యక్రమం ఈ నెల 22 తేదీ నుండి ప్రారంభంకానుంది.
భక్తుల సౌకర్యార్థం ఐదు రోజుల పాటు 22.12.2020 నుండి 26.12.2020 వరకు దీక్షా విరమణ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
నవంబరు 16వ తేదీన శివమండల దీక్షను, డిసెంబరు 6వ తేదీన అర్థమండలదీక్షను స్వీకరించిన భక్తులు ఈ దీక్షా విరమణ సమయంలో దీక్షను విరమించాల్సి వుంది.
కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని శివదీక్షా భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు.
ఈ దీక్షావిరమణను పురస్కరించుకుని దీక్షా విరమణ ప్రారంభపు రోజు (22.12.2020) న ఉదయం స్వామివారి ఆలయ దక్షిణ ద్వారం వద్ద శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులను చేయించి విశేష పూజలను నిర్వహిస్తారు. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లను మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో రథవీధిలో ఊరేగింపుగా తీసుకొని వెళ్లి శివదీక్ష శిబిరాలలో వేంచేబు చేస్తారు.అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారలతో పూజాదికాలు నిర్వహిస్తారు. శివదీక్షా విరమణ కార్యక్రమం పూర్తి అయ్యేంతవరకు కూడా శిబిరాలలోని దేవతామూర్తులకు ఉభయసంధ్యలలో పూజాదికాలు చేస్తారు.
అనంతరం దీక్షా శిబిరాలలోని హోమగుండానికి అర్చకస్వాములు పూజలను జరిపించి హోమాగ్నిని ప్రజ్వలింపజేస్తారు. తరువాత శివదీక్షా భక్తుల ‘ఓంనమశ్శివాయ’ ప్రణవ పంచాక్షరీ నామస్మరణతో శివదీక్షా విరమణ కార్యక్రమం ప్రారంభమవుతుంది .
ఈ కార్యక్రమంలో దీక్షా విరమణ చేసే భక్తులంతా శ్రీ స్వామివారికి జ్యోతిర్ముడిని సమర్పిస్తారు. జ్యోతిర్ముడి సమర్పణానంతరం ఆవునెయ్యి, నారికేళం మొదలుగాగల ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా భక్తులు సమర్పిస్తారు. దీక్షావిరమణ చేసే భక్తులకు పలు సౌకర్యలు కల్పిస్తారు.
శివదీక్షను స్వీకరించిన భక్తులకు రూ. 150/-ల ప్రత్యేక దర్శనము క్యూ లైన్ ద్వారా నిర్ణీత వేళలో స్వామివార్ల దర్శనం కల్పిస్తారు. ఇందులో భాగంగా సిబ్బందికి ప్రత్యేక విధులను కేటాయిస్తారు.
ఈ సిబ్బంది అంతా శివదీక్షా శిబిరాలలో నిరంతరం విడతల వారిగా ప్రత్యేక విధులు నిర్వహిస్తారు.
మన పురాణాలలోను, వ్యవహారిక గాథల్లోనూ ఈ శివదీక్షా ప్రాశస్త్యం ఎంతగానో ఉంది. చారిత్రకంగా కూడా ఈ శివదీక్షకు ఆధారాలు ఉండటం విశేషం. బాదామి చాళుక్య రాజైన రెండవ విక్రమాదిత్యుడు ఆంగ్లశకం 660 సంవత్సరంలో శివమండల దీక్షను స్వీకరించినట్లు గాను, దీక్షను ఇచ్చిన శివగురువు సుదర్శనాచార్యునికి వంగూరు సీమలోని (నేటి జోగుళాంబా గద్వాల జిల్లా) ఇపరుంకల్ అనే గ్రామాన్ని గురుదక్షిణగా ఇచ్చినట్లుగాను, అలంపూరు మండంలోని ఆముదాలపాడులో లభించిన విక్రమాదిత్యుని తామ్రశాసనం చెబుతోంది.