రూ. 12.70కోట్ల వ్యయంతో నిర్మించిన చింతలకుంట చెక్పోస్ట్ అండర్ పాస్ మే ఒకటో తేదీ నుంచి నగరవాసులకు అందుబాటులో రానుంది. మంగళవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ఈ అండర్ పాస్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు . వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (SRDP)లో భాగంగా చేపట్టిన ఏల్బినగర్ చింతలకుంట అండర్పాస్ను ప్రారంభించడంతో ఎస్.ఆర్.డి.పికి చెందిన మూడో ప్రాజెక్ట్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. చింతలకుంట సాగర్ రింగ్ రోడ్ నుండి విజయవాడ వైపు వెళ్లే ట్రాఫిక్ కు ఏమాత్రం ఆటంకం లేకుండా వెళ్ళడానికి మొత్తం 540మీటర్ల పొడవునా అండర్ పాస్ నిర్మాణ పనులను GHMC చేపట్టింది. చింతలకుంట చెక్ పోస్ట్ అండర్ పాస్ నిర్మాణ పనులను గడువులోగా నిర్మాణం పూర్తిచేసి నగర వాసుల వినియోగార్థం తేవడంలో జీహెచ్ఎంసీ విజయం సాధించింది. ఈ అండర్ పాస్తో చింతలకుంట జంక్షన్ లో 95శాతం ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 12మీటర్ల వెడల్పుతో 540మీటర్ల పొడవుతో ఉన్న ఈ అండర్ పాస్లో 112 మీటర్లు క్లోజ్డ్ బాక్స్ గా ఉండగా 428మీటర్లు అప్రోచ్ రోడ్లుగా నిర్మించారు. హైదరాబాద్ నగరంలో రూ.2,631 కోట్ల వ్యయంతో జంక్షన్లు, గ్రేడ్ సపరేటర్లు, ఫ్లైఓవర్లు 18ప్రాజెక్ట్ ల నిర్మాణాలుగల ఐదు ప్యాకేజీలను రాష్ట ప్రభుత్వం 2015 సెప్టెంబర్ లో పరిపాలన సంబందిత అనుమతులను జారీ చేసింది. దీనిలో ప్యాకేజీ 2కింద ఎల్బీనగర్తో పాటు పరిసర ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ది, అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
ట్రాఫిక్ కష్టాలకు చెక్:
ఎల్బీనగర్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు నరకయాతన అనుభవించేవారు. . ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికై ప్రభుత్వం చింతలకుంట చౌరస్తా వద్ద అండర్పాను నిర్మించింది. . పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అండర్ గ్రౌండ్ వేను విదేశీ టెక్నాలజీతో నిర్మించారు. అండర్ గ్రౌండ్ వే నుండి వెళ్తుంటే విదేశాల్లో వెళ్తున్నట్టుగా అనుభూతి కలుగుతుంది. రోడ్లకు ఇరువైపులా అందమైన రంగులతో పెయింటింగ్ వేశారు. ఈ పెయింటింగ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఎల్బీనగర్లో ఐదు జంక్షన్ల అభివృద్ది పనులు:
గ్రేటర్ హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే ఎల్బీనగర్ జంక్షన్తో పాటు పరిసర ప్రాంతాల్లో సిగ్నల్ రహిత రహదారుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 448కోట్ల వ్యయంతో ఐదు ప్రధాన జంక్షన్లలో అండర్ పాస్లు, గ్రేడ్ సపరేటర్లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలను జీహెచ్ఎంసీ చేపట్టింది. ఎల్బీనగర్ జంక్షన్, కామినేని జంక్షన్, చింతలకుంట జంక్షన్, బైరామల్గూడ, నాగోల్ జంక్షన్లలో పెద్ద ఎత్తున నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
రూ. 42.74 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్ జంక్షన్ పనులు
ఎల్బీనగర్ ఫ్లైఓవర్ నిర్మాణం, అండర్పాస్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతున్నాయి. ఎల్బీనగర్ జంక్షన్ వద్ద గంటకు 15,000 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. 2034 సంవత్సరం నాటికి వీటి సంఖ్య 22వేలకు చేరుతుందని అంచనా వేశారు. పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను అదిగమించడానికి చేపట్టిన ఈ ఫ్లైఓవర్, అండర్ పాన్ నిర్మాణం పూర్తితో 90శాతం ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ఎల్బీనగర్ ఫ్లైఓవర్: 780 మీటర్ల పొడవు, 12మీటర్ల వెడల్పుతో ఎల్బీనగర్ ఎడమవైపు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎల్బీనగర్ జంక్షన్ నుండి దిల్సుఖ్నగర్ వైపు 147 మీటర్లు, విజయవాడ వైపు 213 మీటర్ల పొడవులో ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
ఎల్బీనగర్ అండర్ పాస్: కామినేని వైపు నుండి నాగార్జున సాగర్ క్రాస్రోడ్స్ జంక్షన్ వైపు సులువుగా వాహనాలు ప్రయాణం చేయడానికి 520మీటర్ల పొడవుతో అండర్ పాస్ నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. 25.75 మీటర్ల వెడల్పుతో 72.50 మీటర్ల పొడవు గల క్లోస్డ్ బాక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిలో సాగర్ రింగ్ రోడ్ వైపు 165.75 మీటర్ల పొడవు, నాగోల్ వైపు 291.75 మీటర్ల పొడవులో ఈ అండర్ పాస్ నిర్మాణం జరుగుతుంది. ఈ అండర్ పాస్ను డిసెంబర్ మాసంలో ప్రారంభించడానికి పనులను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.
కామినేని జంక్షన్ అభివృద్ది పనులు:
రూ. 45.08కోట్లతో కామినేని వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 12మీటర్ల వెడల్పుతో 940మీటర్ల పొడవు గల ఫ్లైఓవర్లో ఎడమవైపు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జూన్లో పనులు పూర్తిచేసి ప్రారంభించడానికి జీహెచ్ఎంసీ కృషిచేస్తుంది. ప్రస్తుతం ఈ మార్గంలో గంటకు 11వేల వాహనాలు ప్రయాణిస్తుండగా 2034నాటికి వీటి సంఖ్య 17వేలకు చేరుతుందని అంచనా వేశారు. కామినేని జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణంపై దాదాపు 90శాతం వాహనదారులు సలువుగా ప్రయాణించడానికి అవకాశం ఏర్పడనుంది.
బైరమాల్గూడ జంక్షన్ ఫ్లైఓవర్ల నిర్మాణం:
ఎల్బీనగర్ రింగ్రోడ్ వద్ద అత్యధికంగా ఉండే ట్రాఫిక్ అనంతరం బైరమాల్గూడ రింగ్ రోడ్ వద్ద కూడా అంతే మొత్తంలో ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేయడానికి రూ. 38.27 కోట్ల వ్యయంతో బైరమాల్గూడ జంక్షన్ వద్ద ఇరువైపులా రెండు ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. 2019 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో 780 మీటర్ల పొడవుగల ఫ్లైఓవర్ నిర్మాణ పనులను చేపట్టారు.
నాగోల్ జంక్షన్ అభివృద్ది:
ఇటీవల కాలంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందిన నాగోల్ జంక్షన్లో ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేయడానికి రూ. 64.42కోట్ల వ్యయంతో రెండు ఫ్లైఓవర్లను జీహెచ్ఎంసీ నిర్మించనున్నది. 1,040మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఉప్పల్ వైపు 180మీటర్ల పొడవు, ఎల్బీనగర్ వైపు 170మీటర్ల పొడవుతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.