హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సజావుగా జరగడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు.
భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలుగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆద్యంతం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించిన అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. భక్తులు కూడా పూర్తి క్రమశిక్షణతో, అధికారులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం సకాలంలో నిర్వహించడం వల్ల మొత్తం కార్యక్రమం అనుకున్న ప్రకారం జరగడానికి వీలు కలిగిందని సిఎం అభిప్రాయపడ్డారు.
జీహెచ్ఎంసీ, పోలీసు శాఖతో పాటు అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో వ్యవహరించారని సిఎం అభినందించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, గంటల తరబడి నిరీక్షణ లేకుండా, తొక్కిసలాట లేకుండా చాలా ఉత్సాహంగా, భక్తి పారవశ్యంలో నిమజ్జన కార్యక్రమం కన్నుల పండువగా జరిగిందని సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని అన్ని గణేష్ ఉత్సవ కమిటీలకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.