తిరుపతి, 2021 మార్చి 18: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు.
వాహనసేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవోలు శ్రీమతి పార్వతి, రాజేంద్రుడు, ఏఈవో దుర్గరాజు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునిరత్నం, జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.