స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం
స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం
నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామ స్వరాజ్యం
నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్లను అభినందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
జిల్లా పరిషత్లకు నిధులు కేటాయించాలని చైర్ పర్సన్ల విజ్ఞప్తి
హైదరాబాద్-స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని…ఇందులో భాగంగానే నూతన పంచాయతీరాజ్ చట్టానికి కూడా రూపకల్పన చేశామని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ నెల 5 వ తేదీతో నాలుగేళ్ల పదవీకాలం పూర్తి అవుతున్న సందర్భంగా సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్లను జిల్లా పరిషత్ల చైర్ పర్సన్లు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా తమకు నిధులను కేటాయించాలని విజ్ఞాపన పత్రాన్ని మంత్రి జూపల్లికి అందజేశారు. 14 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకే అందజేస్తున్నారని…దీంతో జిల్లా పరిషత్లకు నిధుల కొరత ఏర్పడుతుందన్నారు. గతంలో కేంద్ర నిధులు జిల్లా పరిషత్లకు కూడా వచ్చేవని…అయితే కేంద్రం నిబంధనలను మార్చడంతో గత నాలుగేళ్లుగా కేంద్ర నిధులన్నీ గ్రామాలకే వెళ్తున్నాయన్నారు. కనీసం 50, 60 కోట్ల నిధులను ఒక్కో జిల్లా పరిషత్కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం నిధుల్లోనూ జిల్లా పరిషత్కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు చేయాలన్నారు. అలాగే జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమానంగా తమకు కూడా ప్రోటోకాల్ వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లికి విజ్ఞప్తి చేశారు. అలాగే జెడ్పీ సీఈఓలుగా స్థానిక సంస్థలపై పూర్తి అవగాహన ఉన్నవారినే నియమించాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ల డిమాండ్లపై మంత్రి జూపల్లి సానుకూలంగా స్పందించారు. బంగారు తెలంగాణా సాధనలో స్థానిక సంస్థలదే కీలక పాత్ర అని… గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు అర్హులందరికీ అందేలా చూడాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్లను మంత్రి కోరారు. మంత్రిని కలిసిన వారిలో చైర్ పర్సన్లు తుల ఉమ, పద్మ, రాజు, రాజమణి మురళి, బాలునాయక్, బండారి భాస్కర్, గడిపల్లి కవిత ఉన్నారు.
Post Comment