జడ్చర్ల:మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీగిరి క్షేత్ర అష్ట లక్ష్మీ దేవాలయ ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించిన శత చండీ మహా యాగం ముగిసింది. యాగంలో భాగంగా మూడో రోజు యజ్ఞం రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి-శ్వేత దంపతులు నిర్వహించారు. వారి చేత వేద పండితులు గణపతి పూజలు, కలశ పూజలు చేయించారు. ప్రధాన యాగ కుండలి వద్ద మంత్రి దంపతులు క్రతువు నిర్వహించారు.108 హోమ కుండములలో 108 మంది దంపతులు హోమాలు నిర్వహించారు. ఈ జడ్చర్ల ప్రాంతానికి చెంది 108 జంటలు తమ కుటుంబ సభ్యులతో పాటుగా పాల్గొన్నారు. వారి చేత వేద పండితులు గణపతి పూజ, కలశ పూజలు నిర్వహించి 13 అధ్యాయాలున్న చండీ హోమం వైభవంగా జరిపించారు.
అనంతరం వేద పండితులు శత చండి మహా యాగ ముగింపు పూర్ణాహుతి నిర్వహించారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి హోం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి ప్రత్యేకంగా హాజరయ్యారు.