*ప్రతి కుటుంబంలో దీపజ్యోతులు వెలగాలన్నదే శ్రీవారి ఆకాంక్ష : విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి
విశాఖపట్నం, డిసెంబరు 11: కార్తీక మాసం భక్తుల కోరికలు తీర్చే మాసమని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతిస్వామివారు చెప్పారు. విశాఖపట్టణం ఎంజిఎం గ్రౌండ్స్లో శుక్రవారం రాత్రి టిటిడి నిర్వహించిన శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం కార్యక్రమానికి స్వామి విచ్చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.
శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ కార్తీక మాసం శివకేశవులను ఏకం చేసే మాసమని చెప్పారు. సర్వజగత్తుకు ప్రాణాధారమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు విశాఖ పట్టణానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించడం ఆనందకరమన్నారు. ప్రపంచంలోని ప్రతి కుటుంబంలో దివ్యజ్యోతులు వెలగాలని, తన కృపతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే ఆలోచనతో శ్రీ వేంకటేశ్వర స్వామి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి ఇతర అధికారుల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహింపచేశారని చెప్పారు. విశాఖ భారతదేశంలోనే అతి సుందరమైన నగరమని, ఇక్కడ సముద్రం లోతులోను, నగరం ఎత్తులోను ఉన్నందువల్ల ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా మునిగిపోయే పరిస్థితి ఉండదన్నారు. విశాఖవాసుల కోసం టిటిడి శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిందని, రాబోయే ఏడాదిలో ఈ ఆలయానికి మహాకుంభాభిషేకం జరిగి భక్తులకు భగవంతుడు దర్శనమిస్తారని స్వామి తెలిపారు. డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి టిటిడి ఆధ్వర్యంలో వేద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దీన్ని జాతీయ యూనివర్సిటీగా స్థాయి పెంచాలని టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి గట్టిగా ప్రయత్నించడం అభినందనీయమన్నారు. హిందూ ధర్మపరిరక్షణ కోసం కార్తీక సహస్ర దీపోత్సవం లాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని స్వామి అభిలషించారు.
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైందన్నారు. ఈ మాసంలో శ్రీ వేంకటేశ్వరస్వామి తమ ద్వారా తిరుపతి, విశాఖలో కార్తీక మాస దీపోత్సవాలు, గుడికో గోమాత కార్యక్రమాలు చేయించారని చెప్పారు. దేశంలో భక్తులు ఏ ఆలయానికి వెళ్లినా గోపూజ చేసుకునే ఏర్పాటు చేయడానికి టిటిడి సిద్ధంగా ఉందన్నారు. దేశంలోని ఆలయాలు, పీఠాలు, వేద పాఠశాలలు ముందుకొస్తే టిటిడి గోవును అందిస్తుందని, వాటి రక్షణ, పోషణ మాత్రం వారే చూసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశంతో ఈ నెల 7వ తేదీ కార్తీక సోమవారం నాడు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో, రెండు రోజుల క్రితం హైదరాబాద్లో ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. త్వరలో కర్ణాటక, తమిళనాడులో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. రూ.28 కోట్లతో బీచ్ రోడ్లో నిర్మించిన శ్రీవారి ఆలయానికి వచ్చే ఏడాది మహాకుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. ఇక మీదట టిటిడి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాస ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేదిక మీద శ్రీవారి ఊయలసేవ నిర్వహించారు. వేదస్వస్తితో ప్రారంభించి సంకీర్తన గానం, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ట, శ్రీ సూక్తహోమం, శ్రీ లక్ష్మీ చతుర్వింశతి నామావళితో అర్చన నిర్వహించారు. ఆ తరువాత అష్టలక్ష్మీ స్తోత్ర కూచిపూడి నృత్యప్రదర్శన చక్కగా జరిగింది. అనంతరం వందలాది మంది మహిళలు సామూహిక దీపనీరాజనం చేసి గోవిందనామాలు జపించారు. నక్షత్ర హారతి, కుంభ హారతి, కర్పూరహారతితో కార్యక్రమం ముగిసింది. కోవిడ్-19 నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ మహిళలు దీపాలు వెలిగించేలా ఏర్పాటుచేశారు. వేదికను శోభాయమానంగా పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, బోర్డు సభ్యులు గోవిందహరి, టిటిడి జెఈవో పి.బసంత్కుమార్, శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి గోపాల్, విజివో మనోహర్ పాల్గొన్నారు.