*హుస్నాబాద్ : సాగునీటి వనరులకు జలకళ తేవడమే కేసీఆర్ ఆశయమని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు . ఎంపీ , హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ , ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు హుస్నాబాద్ లో ఎల్లమ్మ చెరువును, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని, ఎమ్మెల్యే అధికారిక క్వార్టర్ నిర్మాణాన్ని ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు. ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ పక్కన నిర్మించిన ఎమ్మెల్యే క్వార్టర్ నిర్మాణం వెంటనే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని ఆదేశించారు. ఎంపీ వినోద్ కుమార్ విలేకర్లతో మాట్లాడారు. సాగునీటికి, తాగునీటికి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. తాజాగా చెరువులు, కాలువల మరమ్మతులకు సీఎం భారీ నిధులు కేటాయించారని ఎంపీ వినోద్ కుమార్ చెప్పారు . తెలంగాణాలో అధికంగా గొలుసుకట్టు చెరువులు ఉన్నాయని, ఇప్పటికే మిషన్ కాకతీయ కింద పనులు చేసారని తెలిపారు. చెరువులకు అనుబంధంగా ఉన్న కాలువలను కూడా అభివృద్ది చేసేందుకు సీ ఎం నిధులు మంజూరు చేసారన్నారు. ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టాలన్నది సీ ఎం సంకల్పమని పేర్కొన్నారు . ప్రాజెక్టుల, రిజర్వాయర్ల నీటితో చెరువులు, కుంటలను కూడా నింపి ఏడాదంతా నీరు నిలువ ఉండేలా చేయాలని సీ ఎం సూచించారని ఎంపీ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతున్నదని, దీని నిర్మాణం పూర్తయితే సాగునీటి వనరులన్నీ జలకళ సంతరించుకుంటాయని వివరించారు.