
*తెల్లవారుజామున 2.27 కు మాంగల్య ధారణ*
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎనిమిదివ రోజు (11.03.2021) న శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు. మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిగాయి. సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, హోమాలు చేసారు.
ప్రభోత్సవం:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ సాయంత్రం గం.5.30 ని!!లకు శ్రీ స్వామి అమ్మవార్ల ప్రభోత్సవం ఘనంగా నిర్వహించారు.
రథోత్సవంలో రథానికి చేసినట్లుగానే ప్రభోత్సవంలో కూడా ప్రభకు పలు రకాల పుష్పాలతో అలంకరణ చేసారు. ప్రభోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్క భజన, శంఖం,డమరుకం, బీరరప్పడోలు, పగటివేషాలు, తప్పెటచిందు,డోలు విన్యాసాలు మొదలైన పలు సాంప్రదాయ జానపద కళారూపాలు కూడా ఏర్పాటుప్రత్యేకం.
నందివాహనసేవ:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న వాహనసేవలో భాగంగా ఈ రోజు (11.03.2021) శ్రీ స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ , ఆలయ ఉత్సవం ప్రత్యేక ఆకర్షణ.
లింగోద్భవకాల మహారుద్రాభిషేకం:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు (11.03.2021) రాత్రి గం.10.00ల నుండి శ్రీస్వామివారికి లింగోద్భవకాల మహారుద్రాభిషేకం, చేసారు. నిష్ణాతులైన 11 మంది అర్చక స్వాములు, వేదపండితులు మహాన్యాసపూర్వకంగా రుద్ర మంత్రాలను పఠిస్తుండగా, దాదాపు 4 గంటలకు పైగా జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీస్వామివారికి అభిషేకం చేసారు.ఆలయప్రాంగణంలోని పవిత్రమైన మల్లికాగుండంలోని జలంతోను, పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ ఈ అభిషేకం చేసారు.లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగాలంకరణ చేసారు. బ్రహ్మోత్సవాలలో జరిగే ఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది. మన వివాహాలలో పెండ్లికుమారునికి తలపాగ చుట్టడం ఒక సాంప్రదాయం . ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ పేరతో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పాగా స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుండి ముఖమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరించారు. పాగాలను సమర్పించే భక్తులు నియమంతో భక్తిని మేళవించి రోజుకు ఒక మూర చొప్పున సంవత్సరంలో 365 మూరల పొడవుతో ఈ పాగాను నేసారు. ఈ పాగాలను అలంకరించే వ్యక్తి దిగంబరుడై అలా పాగాను అలంకరిస్తాడు. దిగంబరుడై పాగాను అలంకరించవలసి వచ్చినందున పాగాలంకరణ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను నిలిపి వేసారు. చిమ్మచీకటిలో సాగాలంకరణ చేయడం ఎంతో నేర్పుతో కూడుకొన్న పని.యథావిధిగా రాత్రి గం.10.00ల నుండి ప్రకాశం జిల్లా, చీరాల మండలం, హస్తినాపుర గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు తాను స్వయంగా తెచ్చిన పాగాతో పాటు ఇతర భక్తులు సమర్పించిన పాగాలను కూడా స్వామివారికి అలంకరించారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను మహా శివరాత్రిపర్వదినాన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి మోహన్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జిల్లా ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప లు గురువారం రాత్రి దర్శించుకున్నారు.గురువారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ను దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్.రామరావు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు.
శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి :
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా భద్రతా చర్యల దృష్ట్యా పార్కింగ్ స్ధలాలు, సిసి కెమెరాల కంట్రోల్ రూమ్ లను కర్నూలు జిల్లా ఎస్పీ పరిశీలించారు.అనంతరం బ్రహ్మోత్సవాల భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంపుల్ క్యూలైన్లు పరిశీలించారు.అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. ఏం.రావు , ఆత్మకూరు డిఎస్పీ శ్రీమతి శృతి ఉన్నారు.
ప్రత్యేక వేదికపై కల్యాణోత్సవం:
ఈ రోజు రాత్రి గం.12.00 లకు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం కార్యక్రమం వైభవంగా చేపట్టారు.
కనుల పండువగా ఈ కల్యాణోత్సవంలో స్వామివారు పాలతెలుపు పట్టువస్త్రాన్ని ధరించి, తలపై ఒకవైపు గంగమ్మను, మరొకవైపు నెలవంకను, మెడలో రుద్రాక్షమాలను, నుదుట విభూతి రేఖలను , పట్టువస్త్రాలను ధరించి పెండ్లికుమారుడుగా ముస్తాబు అయ్యారు.
అమ్మవారు కూడా పాల తెలుపు రంగు గల పట్టువస్త్రాలను ధరించి, నుదుట కల్యాణ తిలకాన్ని, బుగ్గన చుక్కను, సర్వాభరణాలను ధరించి పెండ్లికుమార్తె అయి స్వామికి సరిజోడనిపించుకున్నారు. మంగళ నాదాలతో, వేదమంత్రాల నడుమ నేత్రానందంగా ఈ కల్యాణోత్సవం ప్రత్యేకం. అంతకు ముందు ఈ లీలా కల్యాణానికి కంకణాలను స్వామిఅమ్మవారి అభరణాలను,యజ్ఞోపవీతాన్ని, భాషికాలను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొని వచ్చారు.
లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా అర్చకస్వాములు కల్యాణోత్సవ సంకల్పాన్ని తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ జరిపారు. ఆ తరువాత స్థలశుద్ధి కోసం పుణ్యహవచనం చేసారు.తరువాత కంకణపూజ, యజ్ఞోపవీతపూజ చేసి స్వామివారికి కంకణధార, యపవీతధారణ అనంతరం సప్త ఋషుల ప్రార్థన చేసి కన్యావరణ మంత్రాలను ఆ తరువాత స్వామివారికి వరపూజను చేపట్టారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ప్రవర పఠనాన్ని చదివారు.తరువాత స్వామివారికి మధువర్కం సమర్పించి , శ్రీస్వామి అమ్మవార్లకు వస్త్రాలను కూడా అందించడం విశేషం . తరువాత భాషికధారణ కార్యక్రమం ఆకర్షణ. ఆ తరువాత గౌరీ పూజ చేసారు. స్వామి అమ్మవార్ల మధ్య తెర సెల్లను ఏర్పరచి మహాసంకల్ప పఠనం అనంతరం
సుముహూర్త సమయంలో స్వామి అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పణ ప్రత్యేక ఆకర్షణ. ఆ తరువాత మాంగల్యపూజను జరిపించి, అమ్మవారికి మాంగల్యధారణ జరిగింది. తరువాత తలంబ్రాలు, బ్రహ్మముడి కార్యక్రమాలను జరిపి భక్తులకు ఆశీర్వచనాన్ని అందించారు.