శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం దేవస్థానం ఆలయప్రాంగణంలోని నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలు జరిపింది.ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజికవర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్నిచెప్పారు.అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకుమహాగణపతిపూజను జరిపారు.
నందీశ్వరస్వామికి శాస్తోక్తంగా పంచామృతాలతోనూ, ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షాదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికా గుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం జరిపారు.
పురుషసూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో ఈ విశేషాభిషేకాన్ని చేసారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలను చేసారు . తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు. చివరగా స్వామికి నివేదన సమర్పించారు.
*మాజీ మంత్రివర్యులు శిద్ధారాఘవరావు ఈ రోజు దేవస్థానానికి రూ. 2లక్షలు విరాళంగా అందజేశారు.
ఈ మేరకు వారు సదరు మొత్తాన్ని శ్రీ విష్ణుగ్రానైట్స్ పేరు మీదుగా ఆన్లైన్ ద్వారా దేవస్థానానికి అందించారు.
శ్రీస్వామి అమ్మవార్ల కైంకర్యాలకుగాను ఈ విరాళం అందించారు.కాగా ఇటీవల వారు శ్రీశైలక్షేత్రాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీస్వామిఅమ్మవార్ల కైంకర్యాలకు తాము విరాళాన్ని ఇవ్వదలిచామని, సదరు విరాళాన్ని స్వామిఅమ్మవార్లసేవకు వినియోగించవలసినదిగా కోరారు.తదనుగుణంగానే ఈ రోజు సంబంధిత మొత్తాన్ని దేవస్థానానికి అందించారు.
*దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు
లోకకల్యాణంకోసం దేవస్థానం ఈ రోజు ఆలయప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద వేంచేబు చేసిఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం నిర్వహిస్తున్నారు.
ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను జరిపారు. ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు.లోకోద్ధరణకోసమై బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు.కాగా శ్రీశైలక్షేత్రానికి దత్రాత్రేయుల వారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది.ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద దత్తాత్రేయులవారు తపస్సు చేశారని ప్రతీతి. అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు. దత్తాత్రేయస్వామివారు కలియుగంలో గోదావరితీరాన పీఠాపురంలో శ్రీపాదవల్లభునిగా జన్మించారు. వీరు ఒకసారి శ్రీశైలక్షేత్రంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లుగా గురుచరిత్రలో వివరించారు. శ్రీపాదవల్లభుడు తమ శిష్యులకు ఆయా తీర్థక్షేత్రాల మహిమావిశేషాలను పేర్కొనే సందర్భంలో కూడా శ్రీశైలాన్ని పలుసార్లు ప్రస్తావించారు.శ్రీపాదవల్లభుల జన్మతరువాత మహారాష్ట్రలోని కరంజినగరములో నృసింహసరస్వతి స్వామిగా దత్తాత్రేయస్వామివారు జన్మించారు.వీరు ఒకసారి మహాశివరాత్రి రోజున శ్రీశైలమల్లికార్జునుని సేవించినట్లుగా కూడా గురుచరిత్ర చెబుతోంది.
నృసింహసరస్వతి వారు తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళగంగలోనే చేశారు.కలియుగ ప్రభావం రోజు రోజుకు ఎక్కువ కావడముతో, నృసింహసరస్వతీస్వామి తాము యికమీదట అదృశ్యరూపములో ఉండి తన భక్తులను రక్షించాలని నిర్ణయించారు. దాంతో భౌతికదేహాన్ని త్యజించేందుకు నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైలానికి వచ్చారు.శ్రీశైలంలోని కదళీవనం దగ్గర తమ శిష్యులు చూస్తుండగానే నృసింహసరస్వతిస్వామివారు అరటి ఆకులతో చేసిన ఒక ఆసనంపై కూర్చోని, కృష్ణానదిలో ప్రవేశించి, కొంతదూరం ఆ అరటిఆకులపైనే పయనిస్తూ, అదృశ్యమైనట్లు గురుచరిత్ర చెబుతోంది. అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ శ్రీదత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను జరిపించారు.