
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఈ రోజు (20.02.2021) న కార్యనిర్వహణాధికారి కే ఎస్ .రామ రావు పలు ప్రదేశాలను సందర్శిస్తూ సిబ్బందికి ఆయా చర్యలు చేపట్టవలసినదిగా ఆదేశించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 04.03.2021 నుండి 14.03.2021 వరకు 11 రోజులపాటు నిర్వహించనున్న సందర్భంగా ఈ నెల 11వ తేదీన జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశం లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఉత్సవాల ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ బ్రహ్మోత్సవాలలో యథావిథిగా శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం, మహాశివరాత్రినాడు ప్రభోత్సవం, ఆ మరుసటి రోజు రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహిస్తారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వీటిని జరుపుతారు.
కోవిడ్ నిబంధనల మేరకు ఈ సంవత్సరం శ్రీస్వామివార్ల స్పర్శదర్శనానికి అవకాశం ఉండదు. భక్తులందరికీ కూడా ప్రస్తుతం ఆచరణలో ఉన్నట్లుగానే స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు.
అదేవిధంగా ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనల మేరకు పాతాళగంగలో పుణ్యస్నానాలకు అవకాశం ఉండదు.
భక్తులు స్నానాదికాలు చేసేందుకు వీలుగా గంగాభవాని స్నానఘట్టాలను సిద్ధం చేస్తారు. క్షేత్రపరిధిలో కూడా పలు చోట్ల నీటికుళాయిలను ఏర్పాటు చేసి భక్తుల స్నానాలకు వీలుకల్పిస్తారు.
కాగా కోవిడ్ జాగ్రత్తలలో భాగంగా భక్తులందరు మాస్కును ధరించడం, తరుచుగా చేతులు శుభ్రపరుచుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి ముందుజాగ్రత్తల గురించి భక్తులకు అవగాహన కల్పించేందుకు పలు చర్యలు ఉంటాయి. దేవస్థానం ప్రసార వ్యవస్థ ద్వారా నిరంతరం ముందు జాగ్రత్త చర్యలు గురించి భక్తులకు తెలుపుతారు. క్షేత్రపరిధిలో కోవిడ్ జాగ్రత్తల గురించి ఫ్లెక్సీబోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు.
కాగా అటవీశాఖ సహకారంతో కాలినడకన పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం కూడా అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి.
ముఖ్యంగా పాదయాత్రతో వచ్చే భక్తులకు మంచినీటి సదుపాయం కల్పిస్తారు. ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా చేస్తూ సాక్షిగణపతి, హఠకేశ్వరం, కైలాసద్వారం వద్ద మంచినీటి సదుపాయం ఉంటుంది. అదేవిధంగా కైలాసద్వారం వద్ద జనరేటర్ ఏర్పాటు చేసి తాత్కాలిక విద్యుద్దీకరణ చేస్తారు.
మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఈ రోజు (20.02.2021) న కార్యనిర్వహణాధికారి కే ఎస్ .రామ రావు పలు ప్రదేశాలను సందర్శిస్తూ సిబ్బందికి ఆయా చర్యలు చేపట్టవలసినదిగా ఆదేశించారు.చంద్రవతి కల్యాణమంటపం, శివదీక్షా భక్తుల ప్రత్యేక క్యూలైన్, లడ్డుప్రసాదాల విక్రయ కేంద్రాల ప్రాంగణం, అన్నదాన భవనం మొదలైన వాటిని కార్యనిర్వహణాధికారిపరిశీలించారు.ఈ సందర్భంగా కే ఎస్ .రామ రావు మాట్లాడుతూ శివదీక్షా భక్తులు వేచి వుండేందుకు వీలుగా గతంలో వలనే చంద్రవతి కల్యాణమండపాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు.ఉత్సవాల ప్రారంభం నాటికే చంద్రవతి కల్యాణ మండపంలో ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
అక్కడ ఉత్సవాల ప్రారంభం నుంచే శివదీక్షా భక్తులకు నిరంతరం మంచినీటి సదుపాయం, అల్పాహార వితరణ ఏర్పాట్లను చేయాలని అన్నదాన విభాగాన్ని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.చంద్రవతి కల్యాణ మండపంలో భక్తులను అలరించేందుకు ఎల్.ఈ.డి స్క్రీన్ ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక ప్రవచానలు మొదలైన వాటిని ప్రసారం చేయాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.చంద్రవతి కల్యాణమండపం నుంచి మహాద్వారం వరకు పటిష్టమైన క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులరద్దీని క్రమబద్దీకరించేందుకు క్యూలైన్లను కూడా క్యూ కాంప్లెక్స్ తరహాలో కంపార్టుమెంట్లుగా విభజించాలన్నారు. క్యూలైన్లలో అత్యవసర గేట్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు.భక్తుల సౌకర్యార్థమై చంద్రవతి కల్యాణమండపం వద్ద గల శౌచాలయాలకు అవసరమైన అన్ని మరమ్మతులు చేపట్టాలన్నారు. శివాజీ గోపురానికి ఎదురుగా ఉద్యానవనంలో గల శౌచాలయాలకు కూడా అవసరమై అన్ని మరమ్మతులు చేసి, ఉత్సవాల సమయములో వినియోగంలో ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా శౌచలయాలకు నిరంతర నీటి సౌకర్యం ఉండేవిధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తరువాత కార్యనిర్వహణాధికారి లడ్డు ప్రసాద విక్రయకేంద్ర ప్రాంగణాన్ని పరిశీలించారు. ప్రస్తుతం 6 కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాదాల విక్రయాలు జరుగుతున్నాయి.బ్రహ్మోత్సవాల సమయములో మొత్తం 15 కౌంటర్ల ద్వారా ప్రసాదాల విక్రయానికి చర్యలు చేపట్టాలని లడ్డుప్రసాదాల విక్రయ విభాగాన్ని ఆదేశించారు.బ్రహ్మోత్సవాలలో మొత్తం 30 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేసుకునే విధంగా ప్రణాళికలు చేపట్టి తదనుగుణంగా లడ్డూ ప్రసాదాల తయారీకి చర్యలు తీసుకోవాలని ప్రసాదాల తయారీ విభాగాన్ని ఆదేశించారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి అన్నదాన భవనాన్ని పరిశీలించారు. అన్నదాన భవనంలో అన్నప్రసాదాలను స్వీకరిస్తున్న భక్తులతో సంభాషిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.తరువాత సీసీ కంట్రోలు రూమును పరిశీలించారు. ఈ సందర్భంగా పలుచోట్ల గల సిసి కెమెరాల పనితీరును సమీక్షించారు.ఈ ఏర్పాట్ల పరిశీలనలో ఆలయ సహాయకార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పర్యవేక్షకులు ఎన్. శ్రీహరి, ముఖ్యభద్రతా అధికారి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా వీరితో పాటు ప్రసాదాల విక్రయకేంద్ర పరిశీలనలో సంబంధిత పర్యవేక్షకురాలు శ్రీమతి దేవిక, అన్నదాన భవన పరిశీలనలో ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కాలిబాట మార్గ పరిశీలన:
ముఖ్యంగా భక్తులకు తాత్కాలికవసతి, మంచినీటి సదుపాయం, అన్నదానం, సౌకర్యవంతమైన దర్శనం, వైద్య సేవలు మొదలైన ఏర్పాట్లపై ప్రత్యేకశ్రద్ధ వహిస్తున్నారు.అదేవిధంగా వెంకటాపురం, నాగలూటి, పెచ్చెర్వు, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా కాలిబాట మార్గములో పాదయాత్రతో శ్రీశైల వచ్చే భక్తుల సౌకర్యార్థం కూడా ఆయా ఏర్పాట్లను చేస్తారు.అటవీశాఖ వారి సహకారముతో ఈ ఏర్పాట్లు చేయబడుతాయి.ముఖ్యంగా కాలిబాట మార్గములో మంచినీటి సదుపాయం, అవకాశము ఉన్నచోట వైద్యశిబిరాల ఏర్పాటు మొదలైనవి కల్పిస్తారు.కాలిబాటతో వచ్చే భక్తులు ప్రధానంగా కాలిబొబ్బలు, ఒళ్లు నొప్పులు మొదలైన ఇబ్బందులతో బాధపడుతుంటారు. అందుకే ఈ వైద్యశిబిరాలలో ఈ సమస్యలకు సంబంధించిన పూతమందులు ( ఆయింట్ మెంట్) మాత్రలు మొదలైనవి అందుబాటులో ఉంచబడుతాయి. జిల్లా వైద్యశాఖ వారి సహకారముతో ఈ వైద్యసేవలకు సంబంధించిన ఏర్పాట్లు ఉంటాయి .ఈ ఏర్పాట్లను పురస్కరించుకుని ఈ రోజు (20.02.2021) కార్యనిర్వహణాధికారి పెచ్చెర్వు అటవీ మార్గాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా అటవీ మార్గములో జంగిల్ క్లియరెన్స్, మంచినీటిసదుపాయం మొదలైన అంశాల గురించి సంబంధిత అధికారులతో కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.
ఈ పరిశీలనలో దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అటవీశాఖ సెక్షన్ అధికారి నాగునాయక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.