శ్రీశైల దేవస్థానం: ఆషాఢపౌర్ణమిని పురస్కరించుకొని రేపు 5 న శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి నిర్వహించనున్న శాకంభరీ ఉత్సవానికి తగు ఏర్పాట్లన్నీజరిగాయి.ఇందుకోసం అవసరమైన 40 రకాలకు పైగా ఆకుకూరలు, కూరగాయలను, వివిధ రకాల ఫలాలను తెప్పించారు.సుమారు 3,500 కేజీల కూరగాయలు, ఆకుకూరలు,ఫలాలను ఉత్సవంలో వినియోగిస్తారు.దేవస్థానం సూచనల మేరకు పలువురు దాతలు వీటిని విరాళంగా సమర్పించారు.వంగ,బెండ, దొండ, కాకర, చిక్కుడు, గోరుచిక్కుడు, మునగ, సొర, బీర, గుమ్మడి బంగాళదుంప, కందదుంప క్యాప్పికమ్ (బెంగుళూరు మిరప), క్యాబేజీ, బీన్స్, క్యారెట్, అరటి మొదలైన వివిధ రకాల కూరగాయలు, తోటకూర,పాలకూర, మెంతికూర, చుక్కకూర, మొదలైన పలురకాల ఆకుకూరలు, పుదిన, కరివేపాకు, కొత్తిమీర లాంటి సుగంధ పత్రాలు, కమల, బత్తాయి, ద్రాక్ష, ఆపిల్, అరటి, ఫైనాపిల్ మొదలైన పలురకాల ఫలాలు, నిమ్మకాయలు, బాదంకాయలు మొదలైన వాటిని ఈ ఉత్సవానికై తెప్పించారు.అదే విధంగా ఈ ఉత్సవంలో భాగంగానే రేపటి రోజున శ్రీ భ్రమరాంబాదేవి వారికి విశేషపూజలు నిర్వహిస్తారు.
ఈ ఉత్సవంలో శ్రీ అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలతోనూ, ఆకుకూరలతోనూ , పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరిస్తారు. అమ్మవారికి విశేషపూజలు జరుపుతారు. ఇంకా దేవాలయ ప్రాంగణాన్ని కూడా పలు రకాల ఆకుకూరలు, కూరగాయాలతో అలంకరిస్తారు.
ఈ ఉత్సవంలో భాగంగానే శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తికి, ఆలయప్రాంగణంలోని రాజరాజేశ్వరి దేవికి, సప్తమాతృకలను, గ్రామదేవత అంకాళమ్మకు ప్రత్యేకపూజలు విశేషంగా శాకాలంకరణ చేస్తారు.ఈ విధంగా అమ్మవారిని శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని, కరువుకాటకాలు నివారించ బడతాయిని పురాణాలు చెబుతున్నాయి.
కాగా పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్జానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువుకాటకాలతో తీవ్రక్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణ కోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసింది.ఈ సందర్భంలోనే జగన్మాత తన నుండి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు ఫలాలు మొదలైన శాకాలను సృష్టించి,క్షామాన్ని నివారించింది. ఆ విధంగా అవతరించిన ఆ పరాశక్తి స్వరూపమే శాకంభరీదేవి.ఈ కారణంగానే ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారిని శాకాలతో అలంకరించి ఆర్చించే సంప్రదాయం ఏర్పడింది.