శ్రీశైల దేవస్థానంలో ఘనంగా వివిధ పూజలు

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో ఈ  రోజు వివిధ పూజలు ఘనంగా జరిగాయి.  లోక కల్యాణం కోసం దేవస్థానం 7 న  సాయంకాలం గం.6.30 నుండి శ్రీశైలక్షేత్రపాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేష పూజలు నిర్వహించింద.ప్రతీ మంగళవారం,  అమావాస్యరోజులలో బయలు వీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహిస్తారు.ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం చేసారు.

శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం:

లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలను నిర్వహించింది.ప్రతి మంగళవారం,  కృత్తికా నక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం,  పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) నిర్వహిస్తున్నారు. ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ జరిపి, అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకము, సుబ్రహ్మణ్య అష్టోత్తరము చేసిన అనంతరం సుబ్రహ్మణ్యస్తోత్రము పారాయణలు చేశారు.సుబ్రహ్మణ్యస్వామి  స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు,తేనే,నెయ్యి, కొబ్బరినీళ్లు, వివిధ పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా వివిధ పళ్ల రసాలతో చేసే అభిషేకంలో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి. 

 నందీశ్వరస్వామికి విశేషపూజ:

లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు  ఆలయప్రాంగణంలోని నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలు జరిపింది.ప్రతి మంగళవారం,  త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం ఉంటుంది. ప్రదోషకాలంలో అనగా సాయం సంధ్యా సమయంలో ఈ విశేష పూజలు నిర్వహిస్తారు.నందీశ్వరస్వామికి పంచామృతాలతోనూ, ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం,  మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం జరిపారు.పురుష సూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో  విశేషాభిషేకాన్ని చేసారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలను చేసారు. తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు. చివరగా స్వామికి నివేదన జరిగింది.

print

Post Comment

You May Have Missed