శ్రీశైల దేవస్థానం: ప్రజలందరూ రోగాలకు గురికాకుండా ఆరోగ్యంగా వుండేందుకు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని హాని కలిగించే కరోనా వైరస్ మొదలైన సూక్ష్మాంగ జీవులు వ్యాప్తి చెందకుండా నశించేందుకు ఈ రోజు 16 నుండి ప్రత్యేక పూజాదికాలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఈ ఉదయం శీతలాజపం, మహావిద్యాపారాయణలు ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ జపపారాయణలు కొనసాగుతాయి.అదేవిధంగా రోగకారకాలైన సూక్ష్మజీవులు నశించేందుకు ఈ రోజు వేదసూక్తపారాయణలు ప్రారంభించారు.దేవస్థాన వేదపండితులు ఆయా వేదాలలోని సూక్తపారాయణలను ఈ ఉదయం ప్రారంభించారు.
శీతలాదేవిహోమం |
ఈ రోజు నుండి ఐదురోజులపాటు శీతలాదేవి హోమం కూడా నిర్వహిస్తున్నారు. శ్రీ అమ్మవారి యాగశాలలో ఈ సాయంకాలం నుండి శీతలాదేవిహోమం జరుపుతున్నారు. ఈ హోమాన్ని ఆచరించడం వలన అమ్మవారు లోకాలను చల్లగా చూస్తారని ప్రతీతి.అందుకే ప్రస్తుత విపత్కర పరిస్థితులు తొలగిపోయి, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలనే సంకల్పముతో ఈ హోమం జరుపుతున్నారు.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో వుంచుకుని భౌతిక దూరం పాటిస్తూ, ఏకాంతంగా అర్చకస్వాములు, వేదపండితులు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు:
లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద వేంచేబు చేసి ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.ప్రతి గురువారం దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం ఉంటుంది.
శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం:
లోక కల్యాణం కోసం కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలను నిర్వహించారు.ప్రతి మంగళవారం, కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం , పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) జరుపుతారు.