శ్రీ భ్రమరాంబాదేవి వారికి సంప్రదాయబద్ధంగా వార్షిక కుంభోత్సవం, కోటమ్మవారి పూజలు*
లోక కల్యాణం కోసం శ్రీ భ్రమరాంబాదేవి వారికి ఈ రోజు సంప్రదాయబద్ధంగా వార్షిక కుంభోత్సవం జరిగింది. అమ్మవారికి సాత్త్వికబలిని సమర్పించేందుకు ఈ విశేష ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం.ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశి మొదలైనవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించడం ఆచారం. అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఈ పసుపు,కుంకుమల సమర్పణకే “శాంతి ప్రక్రియ” అని పేరు. పరిమిత సంఖ్యలో సంబంధిత అధికారులు, అర్చకస్వాములు ,వేదపండితులు మాత్రమే ఏకాంతంగా ఈ కుంభోత్సవ సంబంధి పూజలను నిర్వహించారు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు ముందుగా ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, అగ్నిప్రమాదాలు, వాహనప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలగాలని, జనులందరు సుఖసంతోషాలతో ఉండాలని , జనులకు కీడు చేసే సూక్ష్మాంగజీవుల వ్యాప్తి చెందకుండా నశించబడాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, ప్రస్తుత విపత్కర పరిస్థితులు తొలగిపోవాలని కూడా విన్నవించారు.