
కర్నూలు, ఫిబ్రవరి 11: శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మార్చి 1 అన్ లాక్ కోవిడ్ నిబంధనలను అనుసరించి అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నిర్వహణపై జిల్లా ఎస్పీ ఫకీరప్పతో కలిసి సంబంధిత జిల్లాధికారులతో సమీక్ష జరిపారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ , అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామరావు, డిఆర్ఓ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ మాట్లాడుతూ శ్రీశైల మహాక్షేత్రంలో ప్రతి ఏడాది నిర్వహించే తరహాలోనే కాకుండా కోవిడ్ 19 ను దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గ ఏర్పాట్ల నిర్వహణలో అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. మార్చి 4 నుండి 14వ తేదీ వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం వచ్చే భక్తులు, ప్రధానంగా శివదీక్షా పరులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా సంతృప్తి చెందే స్థాయిలో అవసరమయ్యే అన్ని పనులను గుర్తించి ఇప్పటి నుండే ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. వచ్చే నెల 11వ తేదీ మహాశివరాత్రి, పర్వదినాన్ని పురస్కరించుకొని మహాన్యాస రుద్రాభిషేక లింగోద్భవం, రాత్రిపాగాలంకరణ, కల్యాణోత్సవం, గ్రామోత్సవం, రథోత్సవం తదితర అన్ని ఉత్సవాలను సంప్రదాయం ప్రకారం, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేసుకోవాలని శ్రీశైల దేవస్థాన ఈఓకు సూచించారు. కోవిడ్ నిబంధనల మేరకు పాతాళ గంగలో భక్తుల స్నానాలకు అనుమతి ఉండదని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా అన్ని శాఖల అధికారులు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లకు కావాలసిన పనులకు పురమాయించాలన్నారు. త్రాగునీరు, పారిశుధ్యం, పార్కింగ్, బారికేడ్లు, క్యూలైన్లు, ప్రసాద విక్రయ కేంద్రాలు, రవాణ తదితరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గత సంవత్సర శివరాత్రి ఉత్సవాలలో తలెత్తిన లోపాలను పరిగణలోకి తీసుకొని ఈ ఏడాది సంబంధిత సమస్యలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ కె. ఫకీరప్ప మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలకు పోలీసు శాఖ తరపున ప్రాపరుగా బందోబస్తును కేటాయిస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు పోలీసు అధికారులతో సహకరించాలని కోరారు. ఒక ప్రక్క ఎన్నికలు మరో ప్రక్క ఉత్సవ ఏర్పాట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదనపు పోలీసు బందోబస్తును వినియోగిస్తామన్నారు. శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామ రావు మాట్లాడుతూ శ్రీశైల మహాక్షేత్రం వచ్చే భక్తులకు గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల రద్దీ అధికంగా వుంటోందని తగురీతిలో కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 7వ తేదీన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టువస్త్రాలను, మార్చి 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారన్నారు. అంతకుముందు దుర్గ గుడి, కాణిపాకం దేవస్థానాల నుండి కూడా పట్టు వస్త్రాలను సమర్పిస్తారన్నారు. బ్రహ్మోత్సవాలలో ఎలాంటి ఆర్జిత సేవలు ఉండవన్నారు. దేవస్థానం అంతటా ఆర్ఓ మినరల్ వాటర్ ను సరఫరా చేస్తున్నట్లు ఈవో వివరించారు. నడక దారిన వచ్చే భక్తులకు అన్నదాన, త్రాగునీటి వసతి ఏర్పాట్లను ఫారెస్ట్ అధికారుల సహకారంతో చేస్తున్నామన్నారు. వాహనాల పార్కింగ్ కోసం 28 ఎకరాల స్థలాన్ని కేటాయించి దాదాపు 30 వేల వాహనాలు పార్కింగ్ చేసేలా వసతులు సమకూర్చామన్నారు. భక్తులకు ప్రసాదం కొరత రానీయకుండా దాదాపు 30 లక్షల లడ్లు తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అంతకుముందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు చేయాలసిన ఏర్పాట్లపై పిపిటి ద్వారా ఈఓ వివరించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, శ్రీశైలం దేవస్థానం అధికారులు పాల్గొన్నారు