
* శ్రీశైలదేవస్థానం:మార్గశిర శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని ఈ రోజు (09.12.2021) సుబ్రహ్మణ్యషష్ఠి మహోత్సవం నిర్వహించారు.
ఈ ఉత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి (కుమారస్వామి) ప్రత్యేక అభిషేకం, పూజాదికాలు, సుబ్రహ్మణ్యహోమం, తదితర కార్యక్రమాలు జరిపారు.
ఉదయం గం.9.00ల నుండి శ్రీ సుబ్రహ్మణ్యహోమం జరిగింది.
కాగా లోకకల్యాణం కోసం ప్రతి మంగళవారం, షష్ఠి మరియు కృత్తికా నక్షత్రం రోజులలో సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం నిర్వహిస్తున్నారు.
అదేవిధంగా ప్రతిరోజు కూడా ఆర్జితసేవగా వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణం జరిపిస్తున్నారు.
సుబ్రహ్మణ్యషష్ఠిని పురస్కరించుకుని ఈ పూజాదికాలతో పాటు హోమం కూడా జరిగింది.
విశేష అభిషేకం:
ఈ పూజాదికాలకు ముందు లోక క్షేమాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సంకల్పాన్ని పఠించారు. దేశం శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని,జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఈ సంకల్పంలో పేర్కొన్నారు.
సంకల్పం తరువాత పూజాదికాలు నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి జరిపారు.
తరువాత పంచామృతాలతోను గంధోదకం, భస్మోదకం, బిల్వోదకం, పుష్పోదకం మరియు మల్లికాగుండంలోని పుణ్యజలంతో సుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకం నిర్వహించారు.
అనంతరం శాస్త్రోక్తంగా స్వామివారికి పూజాదికాలు జరిగాయి.
సుబ్రహ్మణ్యహోమం:
ఈ పూజాదికాల తరువాత లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సుబ్రహ్మణ్యహోమం జరిపారు.
కాగా శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారి ఆరాధన వలన సంతానం లేనివారికి సత్సంతానం కలుగుతుందని , అదేవిధంగా వివాహం కానివారికి వివాహయోగం సిద్ధిస్తుందని, గ్రహదోషాలు ముఖ్యంగా రాహు,కేతు, కుజదోషాలు , సర్పదోషాలు నివారణ జరుగుతుందని , ఋణబాధలు తీరి, శత్రుబాధలు తొలగిపోతాయని, న్యాయవివాదాలలో విజయం లభిస్తుందని , అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరి కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.